WorldWonders

కాకినాడలో మీ చెత్త మీకే రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తారు

కాకినాడలో మీ చెత్త మీకే రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తారు

మీరు కాకినాడలో ఉంటున్నారా? ఇంట్లో చెత్తను రోడ్డుమీద ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఎవరు చూస్తారులే అనే ధీమాతో ఉన్నారా? ఇలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసేవారిపై కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కఠిన చర్యలు తీసుకోనుంది. ముఖ్యంగా ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ పేరుతో మీరు వేసిన చెత్తను మీ ఇంటికే తెచ్చి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అయినా, మీ పద్ధతి మార్చుకోకపోతే భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుంది.

కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ శనివారం ప్రకటించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని చెత్తను జాగ్రత్తగా పారిశుద్ధ్య సిబ్బందికి మాత్రమే అప్పగించాలని, ఎక్కడపడితే అక్కడ పడేస్తే రిటర్న్‌ గిఫ్ట్‌గా ఆ చెత్తను మీ ఇంటికే తీసుకొస్తామని అన్నారు. వ్యర్థాలను సేకరించేందుకు కాకినాడలో దాదాపు 900మంది పారిశుద్ధ్య కార్మికులు నిత్యం పనిచేస్తున్నారని అన్నారు. రోజూ ఉదయం 7గంటల నుంచి 9 గంటల మధ్య ప్రతి ఇంటికి పారిశుద్ధ్య సిబ్బంది వచ్చి చెత్తను సేకరించి తీసుకెళ్తారని అన్నారు. త్వరలోనే పొడి/తడి చెత్తను వేర్వేరుగా సేకరించే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.