Politics

24 కల్లా భాజపాలోకి విజయశాంతి

24 కల్లా భాజపాలోకి విజయశాంతి

ఫైర్ బ్రాండ్ విజయశాంతి మళ్లీ కాషాయ కండువాకప్పుకోనున్నారా? ఘర్ వాపసీ అవుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె ఈ నెల 24న బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం. పార్టీలో చేరికపై బీజేపీ నేతలతో విజయశాంతి చర్చలు పూర్తయ్యాయి. ఈ నెల 24లోపు ఆమె బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి అమిత్‌షా సమక్షంలో కాషాయకండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చేయిదాటిపోయిందని విజయశాంతి కామెంట్‌ చేయడమే దీనికి సంకేతమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌ ఇంకా ముందు వచ్చి ఉంటే.. కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగయ్యేదేమోనన్న ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కాంగ్రెస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. టీఆర్‌ఎస్‌ పార్టీ భయబ్రాంతులకు గురిచేసి నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోందని విజయశాంతి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరే స్థాయికి బీజేపీ వచ్చిందని రాములమ్మ చెబుతున్నారు. విజయశాంతి తన రాజకీయ జీవితాన్ని బీజేపీతోనే ప్రారంభించారు. భారతీయ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి.. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్‌ఎస్ నుంచి 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌తో విభేదాలు రావడంతో 2014లో కాంగ్రెస్‌లో చేరారు. అయితే విజయశాంతి స్టార్ ఇమేజ్ కలిసి వస్తుందని బీజేపీ గంపెడాశతో ఎదురు చూస్తోంది. బీజేపీ ఆశలు త్వరలోనే ఫలించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అంతిమంగా రాములమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.