Movies

మనస్సాక్షిని నమ్ముతాను

మనస్సాక్షిని నమ్ముతాను

చిత్రసీమలో జయాపజయాలు శాశ్వతం కాదని, తన ఆరేళ్ల సినీకెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకుల్ని చూశానని చెప్పింది పంజాబీ సుందరి కియారా అద్వాణీ. ‘కబీర్‌సింగ్‌’ చిత్రం తనకు తిరుగులేని స్టార్‌డమ్‌ను అందించిందని..ఆ సినిమా విజయంతో నటిగా మరింత బాధ్యత పెరిగిందని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘కెరీర్‌ తొలినాళ్లలో అంతా అయోమయంగా అనిపించేది. విజయం కోసం ఎన్నో రోజులు నిరీక్షించాను. ‘కబీర్‌సింగ్‌’ చిత్రం నా సినీ గమనాన్నే మార్చివేసింది. ఆ సినిమాలో ప్రీతి పాత్ర ద్వారా లక్షలమంది అభిమానాన్ని సంపాదించుకున్నా. బయట ఎక్కడికైనా వెళితే అందరూ ప్రీతి అనే పేరుతో పిలుస్తుండటం గర్వంగా అనిపిస్తోంది. అయితే విజయంలోనే వినమ్రంగా ఉండాలనే విషయం అవగతమైంది. కథాంశాల ఎంపికలో నా మనస్సాక్షి ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాను. ఇతరుల అభిప్రాయాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోను. సినిమా ఫలితం ఎలా ఉన్నా కష్టించి పనిచేయడమొక్కటే కర్తవ్యమని నమ్ముతా’ అని చెప్పింది. తెలుగులో ‘భరత్‌ అనే నేను’ చిత్రం చక్కటి గుర్తింపునిచ్చిందని, మంచి కథ కుదిరితే తెలుగులో మరో సినిమా చేయాలనుందని కియారా అద్వాణీ చెప్పింది.