Fashion

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి

కార్తికమాసం ఆరంభంతో తెలుగిళ్లలో సందడి మొదలైంది. గత మార్చి నుంచి కరోనా భయం, లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల అంతంతమాత్రంగానే జరిగిన శుభకార్యాలు ఇక పుంజుకోనున్నాయి. కరోనా భయం కాస్త తగ్గడం.. వచ్చే నెలరోజుల దాకా శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో పెళ్లి సందడి మొదలైంది. జనవరి 6 దాకా కూడా పెళ్లి ముహూర్తాలున్నట్లు పురోహితులు చెబుతున్నా తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది కార్తికమాసంలో పెళ్లిళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీనికితోడు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 11 దాకా పుష్యమాసంలో గురుమూఢం ఉంది. ఫిబ్రవరి 12 నుంచి మాఘమాసం మొదలైనా మూఢం కొనసాగుతున్నందున పెళ్లిళ్లకు ఆస్కారం లేదు. ఏప్రిల్‌ 13న చైత్రమాసం ఉగాదితో ప్లవ నామ సంవత్సరం మొదలైనా పెళ్లి ముహూర్తాలు లేవు. ఈ లెక్కన వచ్చే నెలరోజుల్లో చేయలేకపోతే తర్వాత దాదాపు మరో 6 నెలలు.. అంటే మే 12న వైశాఖం మొదలయ్యేదాకా మంచి ముహూర్తాలుండవని కొందరు ఇప్పుడే శుభకార్యాలు పెట్టుకుంటున్నారు. మార్చి నుంచి సెప్టెంబరు దాకా పెళ్లి సంబంధాల కోసం సంప్రదించినవారు పెద్దగా లేరని, గత నెల నుంచి మళ్లీ పెరిగారని హైదరాబాద్‌కు చెందిన ఓ మ్యారేజీ బ్యూరో ప్రతినిధి ‘ఈనాడు’కు చెప్పారు. కొంతమంది ఈ కార్తికంలో పెళ్లిళ్లకు సిద్ధపడుతుండగా మరికొందరు ఈ నెలలో నిశ్చితార్థం నిర్వహించుకుని మేలో ముహూర్తాలు పెట్టుకోవాలని భావిస్తున్నారు. అప్పటికి కరోనా భయం పూర్తిగా తగ్గవచ్చన్నది వారి అంచనా.