Kids

అసూయతో అన్నీ కష్టాలే!

Telugu Kids Story - Jealousy Ruins Everything

ఒక వూరిలో మాధవుడు, కేశవుడు అను ఇద్దరు ర్తెతులు ఉండేవారు. మాధవుడు చాలా తెలివైనవాడు. దానికి తోడు బాగా కష్టపడి పనిచేసేవాడు. తనకు లభించిన దానితో సంతృప్తి చెందుతూ సంతోషంగా జీవితాన్ని గడిపేవాడు. కేశవుడు స్వతహగా బద్ధకస్తుడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ విచారంగా ఉండేవాడు. మాధవుడు అంటే అతనికి గిట్టదు. ఎల్లప్పుడూ మాధవుని గురించి అసూయ పడేవాడు. మాధవుడు సుఖంగా ఉండడం అతనికి గిట్టేది కాదు. అందుచేత అతనెప్పుడూ మాధవుడికి కీడు జరగాలనే భగవంతున్ని కోరుకునేవాడు.
మాధవుడు ఎల్లప్పుడూ అందరు తనలాగే సుఖంగా జీవించాలని కోరుకునే వాడు. అందుచేతనే భగవంతుడెప్పుడూ అతన్ని కాపాడుతూ ఉండేవాడు. కొంతకాలం అలా గడిచిపోయింది. మాధవుడు చాలా శ్రమపడి, తన తోటలో గుమ్మడి పాదులు వేసి పెంచాడు. అందులో ఒక పాదుకి ఒక చక్కటి గుమ్మడి కాసింది. అటువంటిది ఎక్కడా దొరకటం కష్టము.
అది నవనవలాడుతూ సప్తవర్ణాలతో చాలా అందంగా ఉంది. మొగలి పువ్వులా మంచి సువాసన వెదజల్లుతూ ఉంది. అన్నింటికంటే ముఖ్యం, అది ఒక ఏనుగాకారంలా ఉంది. దానికి నాలుగు కాళ్ళు ఒక తొండము, ఒక తోక కనిపిస్తున్నాయి. ఇంత మంచి గుమ్మడి పండు మహారాజుకి బహుమతిగా ఇస్తే బాగుంటుందని మాధవుడు అనుకున్నాడు. దానిని రాజధాని నగరానికి తీసుకొని వెళ్ళి ఈ కానుకను స్వీకరించండి మహారాజా! అని వినయంగా సమర్పించాడు.
ఇటువంటి ప్రత్యేకమైన కానుకను తనకిచ్చినందుకు ఒక మంచి ఏనుగును మహారాజు మాధావుడికి బహుమతిగా ఇచ్చాడు. కేశవుడికి ఈ వార్త తెలిసింది. అసూయతో అలమటించాడు. రాత్రంతా నిదురపోలేదు. రాజును మెప్పించి. మాధవుని కంటే మంచి బహుమతిని రాజు వద్ద పొందాలని ఆలోచించాడు. ఏనుగు ఆకారాన్ని ఇచ్చినంత మాత్రం చేతన ఏనుగునిచ్చాడా మహారాజు, నిజమైన ఏనుగునే ఇస్తే ఇంకా ఎంత కానుక ఇస్తాడో, నాకు తప్పక ఒకటి, రెండు గ్రామాలనిస్తాడు. అప్పుడు నేనొక జమీందారునవుతాను అనుకున్నాడు.
మరుసటి రోజున తనకున్న ఆవులు, ఎడ్లు, గొర్రెలు, మేకలు సర్వస్వం అమ్మి పారేశాడు. ఆ సొమ్ముతో ఒక పెద్ద ఏనుగును కొని రాజుగారికి కానుకగా తీసుకొని పోయాడు. సాధారణ రైతు తనకెందుకు బహుకరిస్తున్నాడు రాజుకర్థం కాలేదు. అతడు మంత్రులను పిలిచి ఇందులో ఏదో అంతరార్థం ఉంది. ఆలోచించి చెప్పండి. ఇతనికి తగిన బహుమతి ఏమిటో నిర్ణయం చెయ్యండి అని చెప్పాడు.
ఆ మంత్రిగారు కేశవుడితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పాడు. మాటలలో పెట్టి నిజాన్ని తెలుసుకున్నాడు. మాధవుడి మీదుండే అసూయ ఇందుకు కారణమని తెలుసుకున్నాడు. ఈ విషయమంతా రాజు గారికి తెలియచేసాడు. కేశవుడు బుద్దిని తెలుసుకుని అతనికి గుణపాఠం చెప్పడానికి, మహారాజు అతనికి ఒక గుమ్మడికాయను బహుమతిగా ఇచ్చాడు. ఆ గుమ్మడికాయను చూసి కేశవుడు కుప్పకూలిపోయాడు. అతని హృదయం బ్రద్దలైంది. అతడు తన ఆస్తినంతా అమ్మేసుకున్నాడు. తినడానికి తిండిలేక కట్టుబట్టల్లేక ఇక్కట్లకు గురయ్యాడు. అసూయవల్ల వచ్చే అనర్థం అంతా ఇంతా చెప్పనలవి కాదు.