WorldWonders

₹10లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన గుంటూరు బాలుడు

Guntur Boy Tumma Vinay Plans Fake Kidnap For 10lakhs From Parents

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిన్న అదృశ్యమైన బాలుడు తుమ్మా వినయ్‌ క్షేమంగా ఇంటికి తిరిగివచ్చాడు. డబ్బు కోసం ఆ బాలుడే ఓ కట్టు కథ అల్లినట్లు తేలింది. సత్తెనపల్లికి చెందిన వెంకటేశ్వర్లు అనే వస్త్రవ్యాపారి కుమారుడు వినయ్‌ సోమవారం అదృశ్యమయ్యాడు. రాత్రి సమయంలో అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేసి ‘‘మీ అబ్బాయి మా వద్దే ఉన్నాడు.. రూ.10లక్షలు ఇస్తే వదిలేస్తాం’’అంటూ బాలుడి కుటుంబసభ్యులకు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో వెంకటేశ్వర్లు కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టి నరసరావుపేట రోడ్డులో వే బ్రిడ్జి వద్ద బాలుడిని గుర్తించారు. అనంతరం సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే వినయ్‌ అదృశ్యం వెనుక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డబ్బు కోసం స్నేహితుల సాయంతో కిడ్నాప్‌ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. మున్నా గ్యాంగ్‌ పేరుతో తొలుత రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత రూ.50వేలు.. చివరకు రూ.10వేలు ఇవ్వాలని బేరం ఆడారు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వినయ్‌ స్నేహితులను ఆరా తీయగా మిస్టరీ వీడింది.