ScienceAndTech

మరికొన్ని యాప్స్ నిషేధించిన మోడీ సర్కార్

మరికొన్ని యాప్స్ నిషేధించిన మోడీ సర్కార్

సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో సమాచార గోప్యత దృష్ట్యా ఇప్పటికే 177 యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా మరికొన్ని మొబైల్‌ యాప్‌లపై కొరడా ఝుళిపించింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత దృష్ట్యా చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో 43 మొబైల్‌ అప్లికేషన్లపై చర్యలు చేపట్టింది. హోంమంత్రిత్వశాఖ నేతృత్వంలోని సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ కేంద్రం నుంచి సమగ్ర నివేదికలపై చర్చించిన అనంతరం ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్‌లో తాజాగా నిషేధించిన వాటిలో అలీఎక్స్‌ప్రెస్‌, స్నాక్‌ వీడియో, మ్యాంగో టీవీ ఉన్నాయి. ఐటీ చట్టం 69ఎ సెక్షన్‌ ప్రకారం కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ చర్యలు తీసుకుందని కేంద్రం తెలిపింది. తాజాగా నిషేధించిన యాప్‌లలో చైనా రిటైల్‌ దిగ్గజ కంపెనీ అలీబాబా గ్రూప్‌నకు చెందిన నాలుగు యాప్‌లతో పాటు ఆ దేశానికి చెందిన మరికొన్ని యాప్‌లూ ఉన్నాయి. గల్వాన్ లోయ వద్ద దుందుడుకు చర్యలకు దిగిన చైనాకు బుద్ధిచెప్పేందుకు జూన్‌ 29న ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. సెప్టెంబర్ 2న పబ్జీతో పాటు 118 యాప్‌లపై నిషేధం ప్రకటించిన విషయం తెలిసిందే.