Movies

కీర్తి సురేశ్ ప్రతీకారం

కీర్తి సురేశ్ ప్రతీకారం

హీరో నితిన్‌, దర్శకుడు వెంకీ అట్లూరిపై ప్రతీకారం తీర్చుకుంటానంటున్నారు కథానాయిక కీర్తీ సురేశ్‌. హీరో మీద హీరోయిన్‌ ప్రతీకారమేంటి అనుకుంటున్నారా? అదంతా సరదా కోసమే! నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌దే’. ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్‌ మధ్యలో కీర్తీ సెట్‌లో సేద తీరుతున్న సమయంలో నితిన్‌, వెంకీ అట్లూరి ఓ ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అంతే కాకుండా ‘షూటింగ్‌తో మాకు చెమటలు పడుతుంటే తను మాత్రం హ్యాపీగా రిలాక్స్‌ అవుతోంది’ అని కామెంట్‌ చేశారు. ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అదే ఫొటోను కీర్తీ షేర్‌ చేసి ‘తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటా. అయితే దీని వల్ల షూటింగ్‌ మధ్యలో ఎప్పుడూ నిద్రపోకూడదనే పాఠం నేర్చుకున్నా’’ అని కీర్తీ సురేశ్‌ ఇన్‌స్టాలో రాశారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ నెల పదో తేదీతో చిత్రీకరణ పూర్తవుతుంది.