NRI-NRT

ప్రవాస భారతీయులకు ఈ-బ్యాలెట్

EBallot For NRIs - Indian Election Commission Confirms

ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్‌(ఈటీపీబీఎస్‌)ను ప్రవాస భారతీయులకూ విస్తరించాలని ఎన్నికల సంఘం(ఈసీ) కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. త్వరలో జరగనున్న అసోం, పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో ఈటీపీబీఎస్‌ బ్యాలెట్‌ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది. ప్రవాస భారతీయులు తమ ప్రాంతంలో జరిగే ఓటింగ్‌కు హాజరుకావడం లేదు. వారు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఓటు వేయడం కూడా శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో ఈటీపీబీఎస్‌ విధానాన్ని అమలు చేయడం ద్వారా వారికి ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.