Movies

పూజతో రష్మిక

స్టార్‌ హీరోల సరసన నటిస్తూ.. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు నటి పూజాహెగ్డే. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మాంచి విజయాన్ని అందుకున్న రష్మిక ప్రస్తుతం ‘పుష్ప’ కోసం వర్క్‌ చేస్తున్నారు. కాగా, తాజా సమాచారం ప్రకారం ఈ స్టార్‌ హీరోయిన్స్‌ ఇద్దరూ త్వరలోనే కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు. ‘పడిపడి లేచె మనసు’ చిత్రం తర్వాత దర్శకుడు హనురాఘవపూడి.. దుల్కర్‌ సల్మాన్‌తో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, రష్మికలను కథానాయికలుగా చూపించనున్నారట దర్శకుడు హను. ఈ విషయమై ఇప్పటికే ఆయన ఈ ఇద్దర్నీ సంప్రదించగా.. వాళ్లు కూడా ఓకే అన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతున్న ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.