DailyDose

KPHB హాస్టల్‌లో దారుణహత్య-నేరవార్తలు

Crime News - Man Murdered In Srinivasa Hostel At KPHB

* కే పి హెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధి కేపీహెచ్బీ కాలనీ శ్రీనివాస బాయ్స్ హాస్టల్ లో దారుణ హత్య.శ్రావణ్ అనే ఫార్మా ఉద్యోగిని కొట్టి చంపిన తోటి ఉద్యోగి శ్రీకాంత్రెడ్డి అతని బావ హర్షవర్ధన్ రెడ్డి.హతుడు, నిందితుడు ఇద్దరు శ్రీ కృష్ణ ఫార్మా కంపెనీ ఉద్యోగులు.

* ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో పోలీసులు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జైంతియా జిల్లాలోని కాంగోంగ్‌ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన సోదాల్లో 250 కిలోల పేలుడు పదార్థాలు (2000 జిలెటిన్‌ స్టిక్స్‌), 1000 లైవ్‌ డిటోనేటర్లను కారులో తరలిస్తూ ఇద్దరు నిందితులు చిక్కారు.

* గుంటూరు జిల్లా చౌడవరం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న హైవే భద్రతా వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాకు చెందిన పట్టు రీలర్లు తమ సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో హిందూపురం సిల్క్‌ రీలర్ల సంఘం అధ్యక్షుడు రియాద్‌ అహ్మద్‌ అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

* ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడిని భర్తతో కలిసి దారుణంగా హతమార్చిన సంఘటన రాయచోటి పట్టణం కొలిమిమిట్టలో గురువారం రాత్రి చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నముక్కపల్లి పంచాయతీ రాజులకాలనీకి చెందిన షేక్‌ యూసుఫ్‌(28) కొలిమిమిట్టకు చెందిన ఓ వివాహిత(26)తో మూడేళ్లుగా అక్రమ సంబంధం ఉంది. గతంలో ఈ విషయమై వివాహిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. అప్పటి నుంచి కొన్ని రోజులపాటు భర్తతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి యూసూఫ్‌ సదరు మహిళ ఇంటికెళ్లాడు. ఇంట్లోనే ఉన్న ఆమె, భర్త మౌలాలి ఇద్దరూ కలిసి దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ జి.రాజు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అక్రమ సంబంధమే ప్రాణాల మీదికొచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. యూసూఫ్‌ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

* ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల కోసం ఔషధాలు, వైద్యపరికరాల కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న అభియోగంపై ఏసీబీ నమోదు చేసిన కేసులో మూడో నిందితుడైన బి.ప్రమోద్‌రెడ్డి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం లొంగిపోయారు. టెలిహెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో డైరెక్టరైన ఆయన ఏసీబీ న్యాయస్థానంలో లొంగుబాటు పిటిషన్‌ దాఖలుచేశారు. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీచేశారు. దాంతో ఆయనను జైలుకు తరలించారు.