Business

TSRTC వినూత్నత

TSRTC Door To Door Delivery Of Parcels

తెలంగాణ ఆర్టీసీ కార్గో-పార్శిల్‌ సేవల్లో మరో ముందడుగు వేసింది. పార్శిళ్లను ఇంటింటికి (డోర్‌-టు-డోర్‌) పంపిణీ చేసే వ్యవస్థకు గురువారం నుంచి శ్రీకారం చుట్టనుంది. ఆర్థికంగా కుదుటపడేందుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించిన ఆర్టీసీ పార్శిల్‌-కార్గో సేవలను ప్రారంభించింది. స్వల్ప వ్యవధిలోనే రోజువారీ ఆదాయాన్ని వృద్ధి చేసుకుంది. ఇటీవలే మిలియన్‌ మార్కునూ దాటింది. ఆ సేవలను విస్తరించే క్రమంలో పార్శిళ్లను ఇంటింటికి పంపిణీ చేసేందుకు కొద్ది రోజులుగా కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ నగరంలో ఆ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.ఇందుకు మూడు సంస్థలను ఎంపిక చేసింది. హైదరాబాద్‌ నగరాన్ని మూడు సెక్టార్లుగా విభజించి ఆ సంస్థలకు అప్పగించింది. కూకట్‌పల్లి-గచ్చిబౌలి ప్రాంతాన్ని ఒక సెక్టారుగా, ఎంజీబీఎస్‌, హైదరాబాద్‌ ప్రాంతం మరో సెక్టారుగా, జూబ్లీ బస్టేషన్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాన్ని మూడో సెక్టార్‌గా విభజించింది. వినియోగదారులు ఇంటికి పంపాలని కోరుకుని, అందుకు తగిన ఛార్జీలను చెల్లించిన పక్షంలో పిన్‌కోడ్‌ నంబరు ఆధారంగా ఆ పార్శిల్‌ని సెక్టార్‌ పరిధిలోని ఏజెన్సీకి పంపుతారు. అక్కడి నుంచి దాన్ని వినియోగదారుడి గమ్యస్థానానికి ఆ సంస్థ ప్రతినిధులు చేరుస్తారు. హైదరాబాద్‌లో డోర్‌-టు-డోర్‌ విధానం అమలుపై మూడు నెలలపాటు అధ్యయనం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. అమలులో ఎదురయ్యే అంశాలను గుర్తించి.. ఇతర పట్టణాలకు విస్తరించేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించాలని నిర్ణయించారు.