Business

యాపిల్ నుండి శుభవార్త-వాణిజ్యం

యాపిల్ నుండి శుభవార్త-వాణిజ్యం

* కరోనా నేపథ్యంలో దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే(వర్క్‌ ఫ్రమ్‌ హోం) వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుండడంతో తిరిగి కార్యాలయాలు తెరుచుకునే విషయంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో యాపిల్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) టిమ్‌ కుక్‌ కీలక ప్రకటన చేశారు. తమ ఉద్యోగులు వచ్చే జూన్‌ వరకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కరోనా మహమ్మారి సంక్షోభ కాలంలో సంస్థ సాధించిన ఫలితాల్ని బట్టి ఆ విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించే విషయం ఆధారపడి ఉందని పేర్కొన్నారు.

* పియాజియో ఇండియా నుంచి త్వరలో రాబోతున్న 160 సీసీ స్కూటర్‌ ఏప్రిల్లా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం భారామతీ ప్లాంట్‌లో ఈ స్కూటర్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఈ క్రమంలో ప్రీ లాంచ్‌ బుకింగ్స్‌ను పియాజియో ప్రారంభించింది. రూ.5వేలు చెల్లించి స్కూటర్‌ను ప్రీబుక్‌ చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

* కొవిడ్‌ వ్యాప్తి తీవ్రం కావడంతో లాక్‌డౌన్‌ విధించినా భారత్‌లో స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ డిమాండ్ పై ఎటువంటి ప్రభావం చూపలేదు. కొత్త ఎస్‌యూవీల విడుదల అంశంలో మాత్రం కొంత ఆలస్యమైంది. దీంతోపాటు పలు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లు కూడా మార్కెట్‌ను తాకాయి. ముఖ్యంగా ద.కొరియా, జపాన్‌, అమెరికాలకు చెందిన కంపెనీలు ఎస్‌యూవీలను విడుదల చేయడం విశేషం. కొత్త నిబంధనల ప్రకారం అన్నీ బీఎస్‌-6 ఇంజిన్లతో మార్కెట్లోకి వచ్చాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మధ్యలో ఒడుదొడుకులకు లోనైప్పటికీ మళ్లీ కోలుకుని ట్రేడింగ్‌ను లాభాల్లో ముగించాయి. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడం, ఆర్థిక వ్యవస్థ కోలుకునే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు ఉత్సాహం చూపించారు. వారాంతం కావడంతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మధ్యలో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

* ఈ ఏడాది స్కోడా రాపిడ్‌ రైడర్‌ కార్లను పూర్తిగా విక్రయించేశారు. దీంతో కంపెనీ తన వెబ్‌సైట్‌ నుంచి వీటి ధరను తొలగించింది. 2020లో విక్రయ లక్ష్యాన్ని ర్యాపిడ్‌ రైడర్‌ కార్లు పూర్తి చేశాయని పేర్కొన్నారు.మళ్లీ ఇది జనవరి 2021 నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.