Sports

ఇండియా గెలుపుపై ద్రవిడ్ బెంగ

ఇండియా గెలుపుపై ద్రవిడ్ బెంగ

ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్ ముగిసింది. ఇక అందరి దృష్టి నాలుగు టెస్టుల సిరీస్‌పైనే. డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా తొలి డే/నైట్‌ టెస్టు జరగనుంది. అయితే పితృత్వ సెలవులపై విరాట్ కోహ్లీ ఆఖరి మూడు టెస్టులకు దూరమవ్వడం టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది. కాగా, 2018-19 పర్యటనలో మాదిరిగా భారత్ టెస్టు సిరీస్‌ విజయాన్ని పునరావృతం చేయాలంటే గతంలో పుజారాలా ఆ పాత్రను మరోసారి ఎవరైనా పోషించాలని ఎన్‌సీఏ డైరెక్టర్‌, మాజీ క్రికెటర్‌ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. గత ఆసీస్‌ పర్యటనలో పుజారా 521 పరుగులు సాధించి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ గెలిచాడు.

‘‘గత పర్యటనలో పుజారా నిర్వహించిన బాధ్యతను ఈ సారి ఎవరు పోషిస్తారు? గతంలో పుజారా 500కు పైగా పరుగులు సాధించినట్లుగా టీమిండియాలో ఎవరో ఒకరు సాధించాలి. అది పుజారా అయినా కావొచ్చు. అయితే కోహ్లీకి ఆ అవకాశం ఉండదు. పర్యటన ఆఖరి వరకు అతడు ఉండడు. ఆసీస్‌ను ఎదుర్కోవాలంటే నాలుగు టెస్టుల్లో కనీసం ఒకరైనా 500 పరుగులు చేయాలి. మరోవైపు ఆస్ట్రేలియాలో పరిస్థితులు అత్యంత సవాలుగా ఉంటాయి. నాణ్యమైన పేసర్లు ఆ జట్టులో ఉండటంతో పేస్‌కు అనుకూలించే పిచ్‌లు సిద్ధం చేస్తారు. అయిదు రోజుల్లో 20 వికెట్లు తీయగలం. కానీ పరుగులు చేసే బ్యాట్స్‌మన్‌ మనకి అవసరం. అలా చేస్తే ఆసీస్‌కు దీటైన పోటీ ఇవ్వొచ్చు. స్మిత్, వార్నర్‌ చేరికతో ఆస్ట్రేలియా పటిష్ఠంగా ఉంది’’ అని ద్రవిడ్‌ తెలిపాడు.