WorldWonders

16వ శాతాబ్దంలో వసనలు ఎలా ఉండేవి?

16వ శాతాబ్దంలో వసనలు ఎలా ఉండేవి?

గడిచిన కాలాన్ని తిరిగి వెనక్కి తీసుకురాలేం. చరిత్రను తిరగరాయలేం. అయితే, కొన్ని శతాబ్దాల కిందట ఏం జరిగింది? అప్పటి వ్యక్తుల జీవనం ఎలా ఉండేదనే విషయాలను చరిత్ర పుస్తకాలు, సినిమాల ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ, ఆ కాలంలో పరిమళం ఎలా ఉండేదో తెలుసా? అదేలా సాధ్యం.. గత కాలపు పరిమళం మనకెలా తెలుస్తుంది అంటారా? దాన్ని సాధ్యం చేయాలని పలువురు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఓ ప్రాజెక్టును చేపట్టారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాచీన చరిత్ర గల ప్రాంతాల్లో ఐరోపా‌ ఒకటి. చరిత్రకారులు యూరప్‌ చరిత్రను భద్రపరుస్తూ, భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా శాస్త్రవేత్తలు, కృత్రిమ మేధ, పరిమళాల నిపుణులతో కలిసి ప్రాచీన కాలంలో యూరప్‌ వ్యాప్తంగా ఎలాంటి పరిమళం వచ్చేదో తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘ఒడురొపా’ పేరుతో ఓ ప్రాజెక్టు ప్రారంభించారు. చరిత్రను తెరిచి చూస్తే కాలంతోపాటు మనుషుల జీవన విధానం ఎంతో మారిపోయింది. ఒకప్పుడు వ్యవసాయం మాత్రమే ఉండేది.. ఆ తర్వాత పరిశ్రమలు, కంపెనీలు, ఇతరత్రా ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో సమాజంతోపాటు గాలిలోని పరిమళం కూడా మారుతూ వచ్చింది. అలా 16వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం అర్ధభాగం వరకు యూరప్‌లోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి పరిమళం ఉండేదో కనిపెట్టి ఇప్పటి ప్రజలకు తెలపాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ‘చరిత్రలోని ప్రతి దశకు ఓ ప్రత్యేకమైన పరిమళం ఉంది. వాటిని ప్రజలకు పరిచయం చేస్తే.. వారు చరిత్రను చూడటంతోపాటు అప్పటి పరిమళాన్ని ఆస్వాదించగలరని, అలాగే ప్రస్తుత కాల పరిమళాలపై ఆసక్తి పెరుగుతుందని’ ఒడురొపా బృందంలోని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 2.8మిలియన్‌ యూరోలు(రూ.25కోట్లు) ఖర్చు చేస్తున్నారు. ఏడు భాషాల్లో ఉన్న యూరప్‌ సాహిత్యాన్ని తెలుసుకొని అందులో పరిమళాల గురించి ఉన్న సమాచారాన్ని కృత్రిమమేధ ద్వారా సేకరిస్తారట. కనిపెట్టిన పరిమళాలను మ్యూజియం ద్వారా ప్రజలు ఆస్వాదించేలా చేస్తామని నిపుణులు చెబుతున్నారు.