NRI-NRT

భారత్‌పై అమెరికా “కరెన్సీ కన్ను”

భారత్‌పై అమెరికా “కరెన్సీ కన్ను”

‘కరెన్సీ మానిప్యులేషన్’‌ విషయంలో అగ్రరాజ్యం అమెరికాకు భారత్ అనుమానం పుట్టుకొచ్చింది. కరెన్సీ విలువలో ఉద్దేశపూర్వకంగా మార్పిడీలకు పాల్పడతాయనే అనుమానం ఉన్న దేశాలను అమెరికా తన ‘పరిశీలనల జాబితా’లో ఉంచుతుంటుంది. తాజాగా ఆ జాబితాలోకి భారత్‌తో పాటు తైవాన్‌, థాయ్‌లాండ్‌లను చేర్చింది. అంతేగాక, వియత్నాం, స్విట్జర్లాండ్‌లను కరెన్సీ విలువను ఉద్దేశపూర్వకంగా మార్చే దేశాలుగా యూఎస్‌ ప్రకటించింది. కాగా.. ఈ పరిశీలనల జాబితాలో చైనా, జపాన్‌, దక్షిణకొరియా, జర్మనీ, ఇటలీ, సింగపూర్‌, మలేషియాలూ ఉన్నాయి. ఐర్లాండ్‌ను ఈ జాబితా నుంచి తొలగించినట్లు అమెరికా ఆర్థికశాఖ ప్రకటించింది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ సంరక్షణ, అమెరికా కార్మికులు, వ్యాపారాలకు అవకాశాలు కల్పించే దిశగా నేడు కీలక చర్యలు చేపట్టాం’ అని అగ్రరాజ్య ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాతో ప్రధాన వాణిజ్య భాగస్వామ్యం కలిగి ఉన్న దేశాల్లో కరెన్సీ అవకతవకలపై దృష్టిపెట్టిన అగ్రరాజ్యం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌ను ఈ జాబితాలో చేర్చడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2018 మే నెలలో యూఎస్‌ తొలిసారిగా భారత్‌ను పరిశీలన జాబితాలో చేర్చింది. గతేడాది ఈ జాబితా నుంచి తొలగించింది. కాగా.. విదేశీ క్రయవిక్రయాల ప్రకటనలో భారత్‌ సుదీర్ఘకాలంగా చూపిస్తున్న పారదర్శకతను అమెరికా ఆర్థికశాఖ స్వాగతించింది. సాధారణంగా చాలా దేశాలు తమ ఎగుమతులు పెంచుకోవడానికి కరెన్సీ విలువను తగ్గిస్తుంటాయి. ఇందు కోసం అవి రకరకాల విధానాలను అనుసరిస్తాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వస్తువులు చౌకగా లభిస్తుంటాయి. దీంతో ఇది ఇతర దేశాల వ్యాపారాలకు గండికొడుతుంటుంది.