Food

సింగపూర్ ల్యాబ్‌లో కోడిమాంసం తయారీ

సింగపూర్ ల్యాబ్‌లో కోడిమాంసం తయారీ

మాంసం కావాలంటే జంతువధ జరగాల్సిందే. అయితే, జంతువులను సంహరించకుండా మాంసం ఉత్పత్తి చేయడం ఎంతవరకు సాధ్యమన్న దిశగా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు ఇటీవలి కాలంలో సత్ఫలితాలనిస్తున్నాయి. సింగపూర్‌లో అమెరికాకు చెందిన ‘ఈట్‌ జస్ట్‌’ అనే అంకుర సంస్థ ప్రయోగశాలల్లో పెంచిన కోడిమాంసం అమ్మకాలకు ఇటీవలే పచ్చజెండా ఊపింది. ఇలాంటి అనుమతి ఇవ్వడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. జంతువధతో నిమిత్తం లేకుండా ఉత్పత్తి చేసిన స్వచ్ఛమైన మాంసమని ఆ సంస్థ ఘనంగా ప్రకటించుకుంది. ఈ మాంసాన్ని జంతువుల కణాల నుంచి ఉత్పత్తి చేశామని, ఇది మనుషులు తినేందుకు పూర్తిగా సురక్షితమని చెప్పింది. ఒక బయోరియాక్టర్‌లో ఉత్పత్తి చేసిన ఈ తరహా మాంసంలో పోషకాలు చాలా పెద్దమొత్తంలో ఉంటాయంటున్నారు. జంతుసంక్షేమ సంఘాల ఒత్తిళ్లు, జంతువుల నుంచి పలు రకాల వైరస్‌లు వస్తాయన్న భయం కారణంగా ఇలా ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే మాంసానికి భవిష్యత్తులో డిమాండు బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ముందు మాంసం కోసం తప్పనిసరిగా జంతువులను చంపాల్సిన అవసరం ఉండబోదని ఈట్‌ జస్ట్‌ సంస్థ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు జోష్‌ టెట్రిక్‌ ధీమాగా చెబుతున్నారు. ఒక్క ఈట్‌ జస్ట్‌ మాత్రమే కాదు- ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేసే మాంసంపై ప్రయోగాలు చేస్తున్నాయి. మన దేశంలోని ఐఐటీ గువాహటి కూడా ఇలా జీవహింసకు తావులేని మాంసం ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. సాధారణంగా టిష్యూ ఇంజినీరింగ్‌ పద్ధతిని ఉపయోగించి ఈ కృత్రిమ మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. పరిశోధకులు ముందుగా జంతువుల నుంచే కణాలు సేకరించి, వాటిని చాలా రెట్లు పెంచుతారు. తద్వారా మాంసం తయారవుతుంది. దీని ఉత్పత్తికి అయ్యే ఖర్చు విషయంలోనే పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న విధానాల్లో మాంసం ఉత్పత్తి కాస్త ఖరీదైనదేనని అమెరికాలోని పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ శాఖ ప్రొఫెసర్‌ కోస్టాస్‌ డి.మరనాస్‌ చెబుతున్నారు. కణాలను పెంచడానికి ఉపయోగించే పదార్థాల ఖరీదే ఎక్కువగా ఉందని, దీనికి ప్రత్యామ్నాయాలు చూడగలిగితే ధర అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఏదైనా ఒక జీవిలో జన్యువులు పోషకాలను ఎలా తయారుచేస్తాయో తెలుసుకునేందుకు కంప్యూటర్ల సాయం తీసుకుంటున్నారు. తద్వారా అత్యున్నత నాణ్యత, వీలైనంత తక్కువ ఖర్చుతో మాంసాన్ని ఉత్పత్తి చేయాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యంగా కనిపిస్తోంది. పర్యావరణ, ఆరోగ్య సమస్యల దృష్ట్యా జంతువులను వధించి మాంసం ఉత్పత్తి చేయడం అంత సురక్షితం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల్లో జంతువుల పెంపకం ద్వారా వెలువడుతున్నవి సుమారు 18శాతం. ప్రపంచవ్యాప్తంగా మనుషులు వాడే నీళ్లలో ఎనిమిది శాతాన్ని పశువుల కోసమే వినియోగిస్తున్నారు. మరోవైపు సాధారణంగా జంతువులను పెంచి, వధించడం కంటే ఇలా చేస్తేనే పర్యావరణంపై ఎక్కువ ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రయోగశాలలో మాంసం ఉత్పత్తి చేసేటప్పుడు వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌ ఎక్కువ ప్రమాదకరమని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్బన్‌ డయాక్సైడ్‌ కంటే మీథేన్‌ వాయువు పర్యావరణంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అది వాతావరణంలో 12 ఏళ్లు ఉంటుంది. కార్బన్‌ డయాక్సైడ్‌ మాత్రం కొన్ని లక్షల సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది. ఇది పర్యావరణానికి మరింత ప్రమాదకారి అని చెబుతున్నారు. అందువల్ల ప్రయోగశాలల్లో పెద్దస్థాయిలో మాంసం ఉత్పత్తి ప్రారంభించే ముందు ఈ విధానంలో ఎంత మొత్తంలో కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదల అవుతుందో కూడా లెక్కించాలని అంటున్నారు. కృత్రిమ మాంసం ఉత్పత్తి వల్ల పలు రకాల రసాయన పదార్థాల వ్యర్థాలు నీళ్లలో కలిసే ప్రమాదం ఉందని ‘ఫ్రెంచ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌’కి చెందిన ప్రొఫెసర్‌ జీన్‌ ఫ్రాంకోయిస్‌ హాకెట్‌ వంటివారు ఆందోళన చెందుతున్నారు. మాంసం ఉత్పత్తి చేసే ప్రక్రియలో- నీళ్లలో రసాయన కణాల అవశేషాలు కలుస్తాయని ఆయన చెబుతున్నారు. కేవలం సింగపూర్‌లోని ఒక రెస్టారెంటులో మాత్రమే ప్రస్తుతానికి ఈ కృత్రిమ మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో మరెక్కడా పెద్దమొత్తంలో దీని ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. అందువల్ల కృత్రిమ మాంసం విషయంలో అప్పుడే ఒక అంచనాకు రాలేమని, పూర్తిస్థాయిలో దీని ఉత్పత్తి మొదలైనప్పుడే దాని ప్రభావం ఏమిటన్నది తెలుస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. జంతు ప్రేమికులు మాత్రం ప్రయోగశాలల్లోనే మాంసం ఉత్పత్తి చేయడం మంచిదంటున్నారు.