Politics

చంద్రబాబే సూత్రధారి. ఈడీ ఎదుట వాంగ్మూలం!

Vote For Note Case - Mutthaiah Records Statement Against Chandrababu

ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశాడు. స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు ఇస్తామని అడ్వాన్స్‌గా రూ.50లక్షలు ఇస్తానని.. చంద్రబాబు తనతో చెప్పారని పేర్కొన్నాడు. టీడీపీ మాజీ నేత, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి నోట్లకట్టలతో కనిపించిన వీడియో, ఈ కేసుకు సంబంధించి పలు ఆడియో రికార్డులను సైతం ఈడీ ముందు ధృవీకరించాడు. అదే విధంగా ఓట్లుకు కేసు విషయంలో తనకేమీ కాకుండా, ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ హామీ ఇచ్చారని, వెంటనే విజయవాడకు వెళ్లిపోవాలని తనకు సలహా ఇచ్చినట్లు మత్తయ్య ఈడీకి చెప్పాడు.