Sports

స్మిత్‌కు మానసిక సమస్యలు

కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల స్టీవ్‌స్మిత్‌ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని ఆస్ట్రేలియా మాజీ సారథి కిమ్‌ హ్యూస్‌ అన్నారు. అందువల్లే టీమ్‌ఇండియాపై అతడు సరిగ్గా ఆడలేకపోతున్నాడని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు, క్వారంటైన్‌ ఆంక్షలు అతడిపై ప్రభావం చూపించాయని వివరించాడు. ప్రస్తుత వైఫల్యానికి టెక్నిక్‌తో సంబంధం లేదని వెల్లడించారు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో స్టీవ్‌స్మిత్‌ వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు మొత్తంగా 10 పరుగులు సైతం చేయలేదు. ఇందులో రెండుసార్లు అశ్విన్‌కు చిక్కగా ఒకసారి బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దాంతో టీమ్‌ఇండియా బౌలర్లపై అతడి టెక్నిక్‌ బాగాలేదని విమర్శలు వస్తున్నాయి. ‘స్టీవ్‌స్మిత్ ప్రపంచస్థాయి ఆటగాడు. టీమ్‌ఇండియాతో సిరీసులో మాత్రం అలా కనిపించడం లేదు. నాలుగు నెలలుగా అతడు తన సతీమణి డానీకి దూరంగా ఉంటున్నాడు. కరోనా వైరస్‌ ఆంక్షల వల్ల క్వారంటైన్‌లో గడుపుతున్నాడు. తన భాగస్వామికి దూరంగా ఉండటంతో స్మిత్‌ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. మూడో టెస్టులోనైనా అతడు బాగా ఆడాలని ఆశిస్తున్నాను. స్మిత్‌ కాసేపు క్రీజులో నిలిస్తే చాలు పరుగులు అవే వస్తాయి’ అని హ్యూస్‌ అన్నారు. మెల్‌బోర్న్‌ టెస్టులో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడం విస్మయం కలిగించిందని హ్యూస్‌ తెలిపారు. సిరీసులో 2-0తో ఉండే సువర్ణావకాశం చేజారిందని పేర్కొన్నారు. అడిలైడ్‌లో కుప్పకూలిన టీమ్‌ఇండియాతో ఎంసీజీలో ఆసీస్‌ పేసర్ల బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేయిస్తే బాగుండేదని వివరించారు. భారత జట్టును అజింక్య రహానె ముందుండి నడిపించాడని ప్రశంసించారు. అటు పరుగులు చేయడంలో.. ఇటు ఫీల్డర్లను మోహరించడంలో.. బౌలింగ్‌ చేయించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడని వెల్లడించారు. కోహ్లీ గైర్హాజరీలో జట్టును తాను నడిపించగలనని నిరూపించాడన్నారు.