Business

తెలంగాణాలో బూడిదే బంగారం

తెలంగాణాలో బూడిదే బంగారం

వ్యర్థం అనుకున్న బూడిదకు నేడు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. ఎన్టీపీసీ చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలిస్తోంది. బూడిద వినియోగంపై సంస్థ చర్యలు పలు పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నూతనంగా జియో పాలిమర్‌ గుళికల (కంకర), టైల్స్‌ తయారీకి శ్రీకారం చుట్టడంతో మరింత వినియోగంలోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బూడిద వినియోగం 118.23 శాతం మార్కుకు చేరిందంటే డిమాండ్‌ ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమవుతోంది. బ్రిక్స్, జియో పాలిమర్‌ గుళికల తయారీకి విరివిగా వినియోగిస్తున్నారు. తాజాగా టైల్స్‌ తయారీపైనా దృష్టి సారించారు. ఎన్టీపీసీలో 2,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి నిత్యం 32 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు వినియోగిస్తారు. దీంతో సుమారు 13 వేల మెట్రిక్‌ టన్నుల బూడిద వెలువడుతుంది. దీన్ని చిన్నతరహాæ పరిశ్రమలతోపాటు సిమెంట్, కాంక్రీటు, ఇటుకల తయారీ, రోడ్‌ ఎంబ్యాంక్‌మెంట్, వాణిజ్యపరంగా సిమెంటు, రహదారుల నిర్మాణం, లోతట్టు ప్రాంతాల్లో నింపడం కోసం టెండర్ల ద్వారా విక్రయిస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 25,06,533 మెట్రిక్‌ టన్నుల బూడిద విడుదల కాగా 19,78,750 మెట్రిక్‌ టన్నుల బూడిదను వినియోగంచుకుని 78.94 శాతంగా నమోదు చేశారు. రానున్న రోజుల్లో 100 శాతం వినియోగానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.