Devotional

500 ఎకరాల్లో గుడి

ప్రపంచంలోనే అన్నింటికన్నా పెద్ద హిందూ దేవాలయం “ఆంగ్ కోర్ వాట్” కాంబోడియాలో ఉంది. రకరకాల వలసలలో భాగంగా అక్కడ కొన్ని సంవత్సరాల పాటు హిందూ రాజుల పాలన కూడా సాగింది. ఆ టైంలోనే ‘ఖ్మేర్’ వంశానికి చెందిన ‘రెండవ సూర్య వర్మ’ అనే రాజు ఈ ఆలయాన్ని కట్టాడట. ఆ తర్వాత బౌద్ధ మతం పెరిగిపోవటంతో అక్కడ బౌద్దారామాలు, ఆలయాలు వచ్చాయి. అసలు అంటేనే దేవాలయాల నగరం అని అర్థం. కులేన్‌ పర్వతాల కింద కట్టిన ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా చెప్తారు. అయితే ఇప్పుడు ఇది బౌద్ధ దేవాలయం.మొదట్లో లోకల్స్ అయిన గిరిజన రాజులే ఉన్నా తర్వాత చైనా, భారత దేశం నుంచి వలస వెళ్లిన రాజులు ఆ దేశాన్ని ఆక్రమించారు. క్రీస్తు శకం 1113 సంవత్సరం నుంచి 1150 సంవత్సరాల మధ్య దీనిని కట్టారు అని హిస్టారియన్లు చెబుతున్నారు. 500 ఎకరాల్లో 213 అడుగుల ఎత్తయిన ప్రధాన గోపురం, ఆలయం చుట్టూ 650 అడుగుల వెడల్పు 13 అడుగుల లోతు ఉన్న కందకం ఉంది. ఇంత పెద్ద గుడి మన దేశంలో కూడా ఎక్కడా లేదు. కులేన్‌ కొండలతో, అడవిలో ఉండే ఈ ఆలయం ఇప్పటికీ టూరిస్టులని ఆకర్షిస్తోంది. నిజానికి ఇది విష్ణుమూర్తి కోసం కట్టిన గుడి. పెద్ద విష్ణుమూర్తి విగ్రహం ఇప్పటికీ ఉంది. అయితే ఖ్మేర్ వంశంలో తరవాత వచ్చిన రాజులు బౌద్దాన్ని పాటించారు. ఆ టైంలో ఆ గుడిని బౌద్దారామంగా మార్చారు. మార్చటం అంటే గుడిలో దేన్నీ కదపకుండా బుద్ధుడి, బోధిసత్వుని బొమ్మలని తెచ్చి పెట్టారు తప్ప, గుడిని ఏమాత్రం పాడు చేయలేదు. ఇదంతా 14వ శతాబ్దంలో జరిగింది. తర్వాత యూరోపియన్ల వలసలు కూడా పెరిగి కాంబోడియన్ కల్చర్ లో చాలా మార్పులొచ్చాయి.‘ఫునమ్‌ ఫెన్‌’ – కంబోడియా రాజధాని. ఇక్కడి కరెన్సీ కంబోడియన్ రియాల్స్ కానీ కంబోడియాలోని లావాదేవీలన్నీ అమెరికన్‌ డాలర్లలోనే జరుగుతాయి. లోకల్ కరెన్సీ వాడకం చాలా తక్కువ. అధికారిక భాష ‘ఖ్మేర్’. కంబోడియా దేశ అధికార మతం బౌద్ధం. ఆ దేశపు పాపులేషన్‌లో 95% మంది ఇదే మతాన్ని పాటిస్తారు. వియత్నాం, చైనా మూలాలు ఉన్న ప్రజలతో సహా ఇక్కడ 30 రకాల గిరిజన జాతుల ప్రజలు ఉంటారు. ఇప్పటికీ రాచరిక విధానం అమల్లో ఉన్న దేశం ఇది. ఇక్కడికి వెళ్లటానికి మరీ ఎక్కువ ఖర్చు కాదు. 20,000 నుంచి 30 వేల మధ్యలో కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ఆంగ్ కోర్ వాట్ టూర్ ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఆంగ్ కోర్ వాట్ టెంపుల్ మాత్రమే కాకుండా చుట్టు పక్కల ఉన్న దేవాలయాలు కూడా ఆ టూర్ ప్యాకేజ్‌లో భాగంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ట్రావెల్ ఏజెన్సీలతో కాకుండా సొంతంగా వెళ్లాలి అనుకుంటే… ముంబై, ఢిల్లీ నుంచి సియామ్‌రీప్ సిటీకి ఫ్లైట్స్ ఉన్నాయి. సియామ్‌రీప్ ప్రాంతమంతా దేవాలయాలు, బౌద్ధారామాలు వేలల్లో ఉంటాయి. అవన్నీ చూడాల్సినవే. సియామ్‌రీప్ చేరుకున్న తర్వాత అక్కడే లోకల్ టూర్ గైడ్స్, ట్రావెల్స్ లో ప్యాకేజ్ తీసుకోవచ్చు. లేదంటే వెహికల్స్ అద్దెకు తీసుకొని కూడా తిరగొచ్చు.