Business

బిస్కెట్లపై బాదుడు

బిస్కెట్లపై బాదుడు

రోజువారీ వినియోగించే సబ్బులు, షాంపూలు, నూనెలు, బిస్కెట్ల వంటి ప్యాకేజ్డ్‌ ఉత్పత్తుల ధరలు 4-5 శాతం మేర పెంచేందుకు ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ముడి పదార్థాల వ్యయం పెరగడమే ఇందుకు కారణమంటున్నాయి. ఇప్పటికే మారికో, ఇతర కంపెనీలు తమ ఉత్పత్తుల ధరల పెంపును ధ్రువీకరించాయి. డాబర్‌, పార్లే, పతంజలి లాంటి సంస్థలు కూడా ధరల పెంపుపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. టీ, కొబ్బరి నూనె, వంట నూనె, పామాయిల్‌ వంటి ముడి వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నా, ఇప్పటివరకు భరించామని..ఇక స్థూల మార్జిన్లపై (లాభాలపై) ప్రభావం పడే పరిస్థితి ఏర్పడినందున ధరలు పెంచాలనే యోచన చేస్తున్నాయి. ‘గత 3-4 నెలల్లో వంట నూనెల ధరలు బాగా పెరిగాయి. దీంతో మా వ్యయాలు పెరిగి, మార్జిన్లపై ఒత్తిడి పడుతోంది. ఇదే ధోరణి కొనసాగితే ధరలు పెంచక తప్పని పరిస్థితి వస్తుంద’ని పార్లే ఉత్పత్తుల సీనియర్‌ విభాగ హెడ్‌ మయాంక్‌ షా వెల్లడించారు. డాబర్‌ ఇండియా సీఎఫ్‌ఓ లలిత్‌మాలిక్‌, పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజరావాలా కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. మారికో తమ సఫోలా, పారాచూట్‌ల ధరల్ని ఇప్పటికే పెంచేసింది.