Movies

ఏడంతస్థుల మేడకు 40ఏళ్లు

ఏడంతస్థుల మేడకు 40ఏళ్లు

దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ అంటేనే అప్పట్లో యమ క్రేజ్…ఈ కాంబోలో వచ్చిన నాలుగో చిత్రమే ఏడంతస్తుల మేడ.. సంక్రాంతి సీజన్ లో వచ్చి సూపర్ హిట్ అయింది. సుజాత, జయసుధ పోటీపడి నటించిన ఈ చిత్రానికి మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కొన్ని ప్రత్యేక షోలు ఆడవారి కోసమే వేశారు అంటేఈ చిత్రానికి వున్న డిమాండ్ ఏమిటో అర్థం అవుతుంది.

నాగేశ్వరరావు తన నట జీవితంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించారు. అందులో ‘ఏడంతస్తుల మేడ’ ఒకటి. దర్శక రత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1980, జనవరి 11న విడుదలై రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. సరిగ్గా నేటికి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఏఎన్నార్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. సుజాత, జయసుధ, జగ్గయ్య, ప్రభాకరరెడ్డి తదితరులు నటించిన ఈ సినిమా కేవలం 50 రోజులకే ఒక కోటీ ఇరవై లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించి.

అప్పట్లో అక్కినేని స్టామినా ఏంటో చాటిచెప్పింది. ఇక చక్రవర్తి సంగీత సారధ్యంలో.. అరటి పండు వలిచిపెడితే తినలేని చిన్నది, ఏడంస్తుల మేడ ఇది వడ్డించని విస్తరిది, ఇది మేఘ సందేశమూ లాంటి పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. ఒక పేద వాడు కోటిశ్వరుడైతే.. ప్రేమాభిమానాల పర్యవసానం ఎలా ఉంటుందో చాటి చెప్పే కథతో మలచిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది.

ఝాన్సీ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై వై. అరుణ్ ప్రసన్న నిర్మించిన ఈ సినిమాను ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా.. అక్కినేని నాగార్జున తో రీమేక్ చేయాలని కొందరు దర్శకులు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. ఏదేమైనా ‘ఏడంతాస్తుల మేడ’ చిత్రం హీరోగా.. అక్కినేని నాగేశ్వరరావుకే కాకుండా.. దర్శకుడిగా దాసరికి కూడా ఒక మరిచిపోలేని చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. అక్కినేని నాగేశ్వర రావు హీరోగా కొనసాగుతున్న తరుణంలో వ‌రుస ప్లాప్స్ తో సతమతమవుతున్న స‌మ‌యంలో ఈ ఏడంతస్తుల మేడ సినిమా నాగేశ్వరావుకి మంచి హిట్ ఇవ్వ‌డంతో కెరీర్‌లో నిలదొక్కున్నారు.

ఇక ఈ సినిమా విషయాల గురించి సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ మాట్లాడుతూ.. దాసరి నారాయరావు అప్పట్లో ఫుల్ బిజీగా ఉన్న దర్శకుడు. ఆయనకోసం నిర్మాతలే కాదు హీరోలు ఎదురు చూస్తున్నారు. నేను అప్పట్లో జగపతి బ్యానర్ లో మేనేజర్ గా చాలా సినిమాలకు చేస్తున్నాను. ఆ సమయంలో దాసరి నారాయణరావు మనం సినిమా చేద్దామని చెప్పడంతో కథ ఏమిటి అని అడగకుండా సరే అని చెప్పి సినిమా మొదలు పెట్టాం. అప్పట్లో కాశ్మీర్ లో ప్రత్యేకంగా పాటలు తీసిన మొదటి సినిమా మాదే. ఏడంతస్తుల పాటలు సూపర్ హిట్ అవడమే కాదు.. ఇప్పటికి ఆ పాటలు హిట్ ఆల్బమ్స్ లో ప్లే అవుతున్నాయి.

దాసరి నారాయణరావు ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తి అంటే…చిన్న పాయింట్ దొరికితే చాలు కథ అద్భుతంగా అల్లేస్తాడు. ఆయనతో సినిమా చేయడం నిజంగా గొప్ప అనుభవం. ఈ సినిమా అనుభవాలు గుర్తొస్తే ఇప్పటికీ ఆ క్షణాలు నా కళ్లముందు తిరుగుతాయి. ఇప్పుడు అంతా మారిపోయింది. అలాంటి నటులు, మనుషులు ఇప్పట్లో కనిపించారు. ఆ రోజుల్లో నారాయణ రావు ఒక నిర్మాతకు ఫోన్ చేసి రెండు లక్షలు కావాలి పంపండి అంటే వాళ్ళు ఏకంగా మూడు లక్షలు పంపేవాళ్లు అది ఆయన రేంజ్. ఈ సినిమా చేయడానికి నాగేశ్వరరావు దగ్గరికి వెళ్లి నాకు ఈ సినిమా చేయాలి అని అడిగితే..అక్కడ హాయిగా ఉన్నవుగా మళ్లీ సినిమా ఎందుకు అని ఆయన అంటే..లేదు మీరు చేయాల్సిందే అని అడిగితే నీ ఇష్టం అని చేశారు. టైటిల్ కూడా ఆయనకు ఇష్టం లేదు. కానీ టైటిల్ మార్చేది లేదు అని చెబితే నీ ఇష్టం చెప్పనప్పుడు, వినకపోతే నీ ఇష్టం అని ఆయన చెప్పారు. ఆ తరువాత నేను నిర్మాతగా చాలా సినిమాలు చేశాను అని చెప్పారు.

రేలంగి నాగేశ్వర రావు మట్లాడుతూ.. దాసరి నారాయణ రావు చాలా బిజీగా ఉన్న స‌మ‌యంలో కాశ్మీర్ లో 15 రోజుల పాటు పాటల చిత్రీకరణ కోసం వెళ్ళాము. అక్కడ దాసరి ఖాళీ సమయంలో ఈ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చునేవారు. నాలుగు వెర్షన్స్ రాసుకుని.. అందులో కథ మీద గ్రిప్ ఉన్న బెస్ట్ వెర్షన్ సెలెక్ట్ చేసుకుని సినిమాని తీశారు. నేను దాసరి దగ్గర కో డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజులు. దాసరి నారాయణ రావు ని దగ్గర నుండి చూసిన వ్యక్తిని. దాసరి అంత డేడికేటెడ్ గా కథ, కథనాలతో వర్క్ చేసి తీసిన ఈ సినిమా సూపర్ సూపర్ హిట్ కావడం .. నాగేశ్వర రావు కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ హిట్ గా నిలవడం జరిగింది. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్లీ తీయ‌గ‌ల‌మా అన్నారు. నేను కో డైరెక్టర్ గా పని చేసిన చివరి సినిమా ఇదే అంటూ రేలంగి నరసింహారావు చెప్పారు.