DailyDose

విజయవాడ విమానాశ్రయంలో అంతరాయాలు-తాజావార్తలు

విజయవాడ విమానాశ్రయంలో అంతరాయాలు-తాజావార్తలు

* విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమాన సర్వీసులకు గురువారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేకువజాము నుంచే దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా ముందు ఏముందో కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉదయం 7.20 గంటలకు రావాల్సిన దిల్లీ, బెంగళూరు సర్వీసులు రెండు గంటలు అలస్యమయ్యాయి. వాతావరణం అనుకూలించిక పోవడంతో గన్నవరం చేరుకున్న స్పైస్‌ జెట్‌, ఇండిగో విమానాలు దాదాపు అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి.

* ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లోకి నవ్య కాంతులు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విటర్‌లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసే ఈ సంక్రాంతిని పెద్దల పండుగగా కూడా పిలుస్తారని ఆయన తెలిపారు. ‘‘ సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే ఈ రోజు సానుకూల మార్పునకు ప్రతీక. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లోకి నవ్యకాంతులు తీసుకురావాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని ఉపరాష్ట్రపతి ట్విటర్‌లో తెలిపారు.

* విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కోదండ రామాలయాన్ని సందర్శించారు. అక్కడ కొండపైన ఆలయంలో దుండగులు ధ్వంసం చేసిన స్వామివారి విగ్రహం, ధ్వంసమైన స్వామివారి విగ్రహం లభించిన కొలనును పరిశీలించారు. కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించిన వివరాలు అక్కడి అధికారులు ఆయనకు వివరించారు.

* భారత్‌లో కొత్తరకం కరోనా(యూకే స్ట్రెయిన్‌) కేసుల సంఖ్య 109కు చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ గురువారం వెల్లడించింది. సాధారణ కరోనా వైరస్‌ కంటే త్వరితంగా వ్యాపించే కొత్తరకం (యూకే స్ట్రెయిన్‌) కరోనాను బ్రిటన్‌లో గుర్తించినప్పటి నుంచి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబరు 22 నుంచి యూకే నుంచి విమానాలను నిషేధించారు. తర్వాత యూకే నుంచి విమానాలను అనుమతించినప్పటికీ యూకే నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేసుకొని రావాలనే నిబంధనను పెట్టారు.

* మూడు వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి తప్పుకొంటున్నట్టు భారతీయ కిసాన్‌ సంఘం (బీకేయూ) అధ్యక్షుడు భూపీందర్‌సింగ్‌ మాన్‌ ప్రకటించారు. ఈ ప్యానల్‌ నుంచి తనకు తానుగా తప్పుకొంటున్నానన్నారు. ఈ కమిటీలో సభ్యుడిగా నామినేట్‌ చేసినందుకు సర్వోన్నత న్యాయస్థానికి కృతజ్ఞతలు తెలిపిన మాన్‌.. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఎలాంటి పదవినైనా త్యాగం చేసేందుకు సిద్ధమేనన్నారు.

* వంటింటి అవసరాలైన ఉల్లి, ఆలు ధరలు తగ్గడంతో డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 1.22 శాతానికి తగ్గింది. నవంబర్లో ఇది 1.55%, 2019 డిసెంబర్లో 2.76 శాతంగా ఉండేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీంతో 2020 నవంబర్లో 4.27 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ ఆహార సూచీ 2020 డిసెంబర్‌కు 0.92 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. డిసెంబర్లో కూరగాయాల టోకు ధరలు (-) 13.2 శాతానికి తగ్గాయని ప్రభుత్వం తెలిపింది. నవంబర్లో ఇది 12.24 శాతంగా ఉండేదని వెల్లడించింది.

* జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జనవరి 31న నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని జనవరి 17 నిర్వహించాలని తొలుత కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి భారీ ఎత్తున కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీని మార్చినట్టు తెలిపింది.

* టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ చేసిన వ్యాఖ్యలు తనని ఏమాత్రం ప్రభావితం చేయవని, తన గురించి ఏమైనా అనుకోవచ్చని ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌పైన్‌ అన్నాడు. మూడో టెస్టు చివరి రోజు భారత బ్యాట్స్‌మెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(39*), హనుమ విహారి(21*) బ్యాటింగ్‌ చేస్తుండగా, పైన్‌ స్లెడ్జింగ్‌కు‌ పాల్పడిన సంగతి తెలిసిందే. అశ్విన్‌ను అతడు దూషించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో అదే రోజు గావస్కర్‌ స్పందించాడు. ఆసీస్‌ కెప్టెన్‌గా పైన్‌ రోజులు దగ్గరపడ్డాయన్నాడు. ఈ మ్యాచ్‌లో పైన్‌ ప్రవర్తన బాగోలేదని, కొన్ని క్యాచ్‌లు కూడా వదిలేశాడని గావస్కర్‌ విమర్శించాడు.

* సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ప్రసిద్ధి చెందిన మధురైలోని అవనియపురంలో తొలుత ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, డీఎంకే నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొని ఆరంభ వేడుకలను వీక్షించారు. ఈ సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ జల్లికట్టు వేడుకల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

* విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కోదండ రామాలయాన్ని సందర్శించారు. అక్కడ కొండపైన ఆలయంలో దుండగులు ధ్వంసం చేసిన స్వామివారి విగ్రహం, ధ్వంసమైన స్వామివారి విగ్రహం లభించిన కొలనును పరిశీలించారు. కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించిన వివరాలు అక్కడి అధికారులు ఆయనకు వివరించారు. అయితే చినజీయర్‌ స్వామి రామతీర్థం పర్యటనను దేవాదాయశాఖ గోప్యంగా ఉంచడం గమనార్హం. అనంతరం చినజీయర్‌ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. రామతీర్థం ఆలయ నిర్మాణానికి ఆగమశాస్త్ర సూచలను చేసినట్లు చెప్పారు. ఈ నెల17 నుంచి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ఆలయాల దర్శన యాత్ర చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఆలయాల్లో ఘటనల తీరు, లోపాలను తెలుసుకునేందుకే పర్యటన చేస్తున్నట్లు వివరించారు. లోపాలను సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు సూచిస్తామని చినజీయర్‌ స్వామి తెలిపారు.

* తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలనలేని వ్యవస్థ వచ్చినప్పుడే ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు వస్తాయని కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన పతంగోత్సవాన్ని భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్‌తో, ఎమ్మెల్సీ రామచందర్‌రావులతో కలిసి కిషన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.