Movies

నేడు NTR 25వ వర్ధంతి

నేడు NTR 25వ వర్ధంతి

నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం అంతా కలిపితే పద్నాలుగేళ్లు కూడా ఉండదు. అంత తక్కువ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వాళ్లు మరొకరు లేరు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అయినా, తెలుగుదేశం పార్టీకి గట్టి సిద్ధాంత పునాది కల్పించారు. రాష్ట్రాల హక్కుల కోసం ఎడతెగని పోరాటం చేశారు. కేంద్రం పెత్తనాన్ని ఎదుర్కొన్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే కమ్యూనిస్టులు, భాజపా నేతలను ఒకతాటి మీదకు తీసుకువచ్చారు. 1989లో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడటంలో ముఖ్య భూమిక పోషించారు.

1980ల నాటి దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ప్రముఖ పాత్ర వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా జనసామాన్యంలో విస్తృతంగా రాజకీయ చైతన్యాన్ని కలిగించారు. పాతుకుపోయిన వ్యవస్థల మీద యుద్ధం చేశారు. రాజకీయాల్లో నాయకీయత చొప్పించారు. కొంత వ్యక్తి పూజకీ కారకుడయ్యారు. ఆలోచనలు మంచివైనా, ఆచరణలో నియంతృత్వ వైఖరి అవలంభించారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు.అంత తక్కువ సమయంలో అన్ని ఎత్తుపల్లాలు చూసిన రాజకీయ నాయకుడు… నటుడిగానే కాకుండా, రాజకీయ నాయకుడిగా కూడా సామాన్య ప్రజానీకం మీద అంత ప్రభావం చూపిన వ్యక్తి తెలుగునాడులో మరొకరు లేరు.

ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంలో అనేక అబ్బురపరిచే అంశాలున్నాయి. అరవై ఏళ్ల వయసులో రాజకీయరంగ ప్రవేశమొక్కటే విశేషం కాదు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న ఆయన రికార్డును అన్నాడీఎంకే నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ వరకు ఇంతవరకు ఎవరూ అధిగమించలేదు. ఉత్తర భారతంలో విస్తృతంగా పర్యటించి, హరియాణా నుంచి అసోం వరకు జనాన్ని ఉర్రూతలూగించిన దక్షిణాదికి చెందిన ఏకైక నాయకుడు ఎన్టీఆరే.

ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ప్రజా జీవితంలోకి వచ్చినా.. రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తిని, సమాఖ్య వ్యవస్థ అవసరాన్ని నొక్కిచెప్పి తనదైన ఒక సైద్ధాంతిక పునాదిని ఎన్టీఆర్‌ ప్రతిపాదించారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడైనా జాతీయ ప్రత్యామ్నాయం కోసం అహర్నిశలూ కృషి చేశారు. కాషాయ వస్త్రాలను ధరించినా లౌకికవాదాన్ని బలంగా నమ్మారు. తెలుగు ఆత్మగౌరవ నినాదంతో వచ్చినా, జాతీయవాదిగా నిలబడ్డారు. సంక్షేమ పథకాలకు మారుపేరుగా నిలిచినా, ప్రైవేటు రంగ ప్రాధాన్యాన్ని గుర్తించారు. భూస్వామ్య నేపథ్యం నుంచి వచ్చినా, పాలనావ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చారు. రాజకీయాన్ని వృత్తిగా కాకుండా లక్ష్యసాధనకు మార్గంగా పరిగణించారు. రాజకీయ పదవులను తృణప్రాయంగా చూశారు.

ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను రాజకీయంగా విభేదించే వారు కూడా.. తెలుగు జాతికి గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తిగా ఎన్టీఆర్‌ను అభిమానిస్తారు. ఎన్టీఆర్‌ ఒక సునామీలాగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి, అధికారాన్ని చేజిక్కించుకున్న సమయంలో ఐఏఎస్‌ అధికారి, ప్రముఖ ఆర్థిక వేత్త బీపీఆర్‌ విఠల్‌ ..సూడాన్‌ ప్రభుత్వంలో ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నారు. ‘ఎన్టీఆర్‌ ప్రమాణ స్వీకారాన్ని నేను సూడాన్‌ టీవీలో చూశాను. భారతదేశంలో తెలుగువారు ఒకరున్నారని ఈ ప్రాంతంలో మొదటిసారిగా తెలిసింది. తెలుగువారిగా గుర్తింపు కోసం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినా, నిజానికి ఆ గుర్తింపు వచ్చింది ఎన్టీఆర్‌ రాకతోనే’ అని విఠల్‌ రాశారు.

ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ నినాదానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఇతర రాష్ట్రాల వారికి, భాషల వారికి వ్యతిరేకం కాదు. ఎన్నడూ మరొక భాషను, ప్రజా సమూహాన్ని వేలెత్తి చూపలేదు. దూషించలేదు. కాంగ్రెస్‌ దిల్లీ నాయకత్వం మీదే ఆయన తన విమర్శలు గురిపెట్టారు. ఈ విషయంలో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన భాషా ఉద్యమాలకి, ఎన్టీఆర్‌ తెలుగు ఆత్మ గౌరవ పోరాటానికి గుణాత్మక తేడా ఉంది. ఆయన ఎన్నడూ వేరొక సంస్కృతిని కించపరచలేదు. ద్రవిడ పార్టీల మాదిరిగా ఉత్తరాది మీద, మరీ ముఖ్యంగా హిందీ మీద వ్యతిరేకత చూపలేదు. పైగా ఇతర భాషలకు, మైనారిటీ వర్గాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని కూడా ఎన్టీఆర్‌ తొలి మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. అందుకే తెలుగు భాషాసంస్కృతులకు అంతర్జాతీయ ప్రాభవం తీసుకొచ్చిన ఆయనను తెలుగు జాతి ఎన్నటికీ మరువలేదు.