ScienceAndTech

ఇండియాలో శాశ్వతంగా మూతపడనున్న టిక్‌టాక్

ఇండియాలో శాశ్వతంగా మూతపడనున్న టిక్‌టాక్

భారత్‌లో విపరీతంగా పాపులర్ అయిన వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై శాశ్వత నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. వి చాట్‌తో సహా మొత్తం 59 యాప్‌లు ఈ శాశ్వత నిషేధ జాబితాలో ఉండనున్నట్లు భారత సమాచార మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. చైనా కంపెనీలకు చెందిన ఈ యాప్‌లపై జూన్ 2020లో కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా శాశ్వత నిషేధానికి సంబంధించి సదరు కంపెనీలకు మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.

నిషేధం అనంతరం..వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఏవిధంగా వినియోగిస్తున్నారో తెలపాలంటూ ప్రభుత్వం ఆ యాప్‌లను ఆదేశించినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే వాటి వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో గతవారం నోటీసులు జారీచేసినట్లు వెల్లడించాయి. భారత్, చైనా సరిహద్దులోని సిక్కిం నకులా ప్రాంతంలో తాజాగా జవాన్ల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఈ శాశ్వత నిషేధం అంశం వెలుగులోకి రావడం గమనార్హం. ఈ ఘర్షణల్లో రెండు దేశాలకు చెందిన జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. కొద్ది నెలలుగా తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో గతేడాది జూన్‌లో తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు తలెత్తడంతో పాటు ప్రాణనష్టం కూడా జరగడంతో.. టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లపై కేంద్రం కొరడా ఝులిపించింది. దేశంలో విపరీతంగా ప్రాచుర్యం పొందిన పబ్జీ గేమ్‌పై కూడా నిషేధం విధించింది. అయితే, కొద్దిపాటి మార్పులతో పబ్జీ మరోసారి భారత్‌లో అడుగుపెట్టాలనుకున్నప్పటికీ, కేంద్రం నుంచి అనుమతి లభించలేదని ఆర్టీఐ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కాగా, తాజా వార్తలపై టిక్‌టాక్‌ ప్రతినిధి స్పందించారు. ‘భారత ప్రభుత్వ నోటీసులను పరిశీలించి, తగిన విధంగా స్పందిస్తాం. జూన్ 29, 2020న కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా మొదట నడుచుకున్నది మా కంపెనీనే. స్థానిక చట్టాలు, నిబంధనలను పాటించేందుకు నిరంతరం ప్రయత్నిస్తాం. వినియోగదారుల గోప్యత, భద్రతను నిర్ధారించడం మా ప్రథమ ప్రాధాన్యం’ అని వెల్లడించారు.