Business

పాతికేళ్ల కనిష్ఠ ధరకు పడిపోయిన బంగారం

పాతికేళ్ల కనిష్ఠ ధరకు పడిపోయిన బంగారం

కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ ఆర్థిక అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని, పెట్టుబడులను ఇటువైపు మళ్లించడంతో అంతర్జాతీయంగా పసిడి ధర రికార్డు గరిష్ఠాలకు చేరింది. దేశీయంగా లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు మందగించిన ఫలితంగా 2020 మొత్తంమీద భారత్‌లో పసిడి గిరాకీ 25 ఏళ్ల కనిష్ఠానికి చేరి, 446.4 టన్నులకు పరిమితమైంది. 2019 గిరాకీ 690.4 టన్నులతో పోలిస్తే 35 శాతం తక్కువని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన ‘గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌’ నివేదిక వెల్లడించింది.
*విలువ పరంగా చూస్తే మాత్రం ఈ తేడా 14 శాతమే తగ్గింది. ధర బాగా పెరిగి, 2020లో 10 గ్రాములు రూ.50,000 దరిదాపుల్లో కదలాడటం ఇందుకు కారణం.
* ఆభరణాలకు గిరాకీ 42 శాతం మేర క్షీణించి 315.9 టన్నులకు, పెట్టుబడుల గిరాకీ 11 శాతం తగ్గి 130.4 టన్నులకు పరిమితమైంది.
* పండుగల సీజను, పెళ్లిళ్ల కారణంగా అక్టోబరు-డిసెంబరులో గిరాకీ పుంజుకుంది. ఈ సమయంలో వినియోగం 2019 ఇదేకాలంతో పోలిస్తే 4 శాతమే తగ్గి 186.2 టన్నుల వద్దే ఉంది. అదే సమయంలో ఆభరణాల గిరాకీ 8% తగ్గి 137.3 టన్నులకు చేరింది. పెట్టుబడుల గిరాకీ 8% పెరిగి 48.9 టన్నులకు చేరింది.
* 2019 నాటి 211.5 టన్నులతో పోలిస్తే గతేడాదిలో ముడి పసిడి దిగుమతులు 114 టన్నులకు తగ్గాయి. 2020లో మొత్తం 95.5 టన్నుల పైడి పునర్వినియోగానికి వచ్చింది. అంతక్రితం ఏడాది 119.5 టన్నుల పసిడి ఇలా వినియోగమైంది.
బహుమతిగా పాతబంగారం: డాలర్‌ విలువకు తోడు పన్నుల వల్ల దేశీయంగా పసిడి ధర మరింత అధికమైంది. ఫలితంగా వినియోగదార్లు పాత బంగారాన్ని/ఆభరణాలను విక్రయించడానికి బదులుగా పెళ్లిళ్లు ఇతర వేడుకల్లో సన్నిహితులకు బహుమతి కింద ఇవ్వడానికి మొగ్గుచూపారు. తమ ఆర్థిక అవసరాలకు పసిడిని అమ్మకుండా.. పసిడి రుణాలు తీసుకున్నారు. అందుకే పునర్వినియోగం తగ్గింది.
* ప్రస్తుతం దిగుమతి సుంకం, జీఎస్‌టీ కలిపి 15.5 శాతం ఉండగా, బడ్జెట్‌లో తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. 2021లో భారత్‌లో పసిడి గిరాకీపై డబ్ల్యూజీసీ అంచనాలను వెలువరించలేదు. ఆ సంస్థ దేశీయ ఎండీ సోమసుందరం మాట్లాడుతూ ‘2019 నాటి స్థాయులను పసిడి మార్కెట్లు మళ్లీ చూడొచ్చ’ని అన్నారు. అంతర్జాతీయ గిరాకీ 11 ఏళ్ల కనిష్ఠానికి: అంతర్జాతీయంగా పసిడికి గిరాకీ గతేడాది 11 ఏళ్ల కనిష్ఠానికి చేరి 3,759.6 టన్నులకే పరిమితమైంది. 2019లో వినియోగ గిరాకీ 4386.4 టన్నులుగా ఉంది. 2009 తరవాత 4000 టన్నుల కంటే గిరాకీ తగ్గడం మళ్లీ ఇప్పుడే. గతేడాది భారత్‌లోకి అక్రమ మార్గంలో వచ్చే(స్మగ్లింగ్‌) పసిడి పరిమాణం తగ్గింది. లాక్‌డౌన్‌లు, విమాన, నౌకాయానాల నిలిపివేత, కఠిన పరిశీలనల కారణంగా ఈ సారి 25 టన్నుల్లోపే ఇలా వచ్చిందన్నది డబ్ల్యూజీసీ అంచనా. 2019లో దాదాపు 115-120 టన్నుల మేర పసిడి దొంగచాటుగా వచ్చినట్లు అంచనా.