DailyDose

సుమంత్ అరెస్ట్-నేరవార్తలు

Crime News - Facebook Fake Profile Scammer Sumanth Arrested

* అమ్మాయిలను లోబరుచుకునేందుకు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకున్న సుమంత్‌ను సైబర్‌‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ… నకిలీ ఇన్‌స్ట్రాగ్రామ్‌ ప్రోఫైల్‌తో అమ్మాయిలతో చాటింగ్‌ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న సుమంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు సుమంత్‌ విజయవాడకు చెందిన వాడని, హైదరాబాద్‌లోని మణికొండలో ఉంటూ అమెజాన్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు. రాత్రి అయ్యిందంటే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అమ్మాయిలా మారిపోయి మిగతా అమ్మాయిలతో చాటింగ్‌ చేయడమే పనిగా పెట్టుకున్నాడని, ఇంటర్నెట్‌ నుంచి యువతుల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసుకుని వాటితో నకిలీ ప్రోఫైల్‌ క్రియోట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

* ఏటీఎంలో జ్యోతి ఉదయ్‌ అనే బ్యాంకు ఉద్యోగినిపై కొడవలితో దాడి చేసిన కేసులో దోషిగా తేలిన కె.మధుకర్‌రెడ్డికి బెంగళూరులోని 65వ సిటీ సివిల్‌ కోర్టు శిక్ష ఖరారు చేసింది. 12 ఏళ్ల కారాగారవాసం విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2013 నవంబరు 19న ఉదయం 7.30 గంటల సమయంలో బెంగళూరు కార్పొరేషన్‌ సర్కిల్‌లోని కార్పొరేషన్‌ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్‌ డబ్బులు తీసుకుంటూ ఉండగా మధుకర్‌ కొడవలితో గాయపరిచి కొంత డబ్బు ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

* అమ్మాయిలు బట్టలు మార్చుకునే గదిలోకి తొంగిచూస్తూ అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. సీలింగ్‌పై నుంచి గదిలోకి పడి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన అమెరికాలోని వర్జీనియాలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్టాండ్‌ఫోర్డ్‌ కౌంటీ షరీఫ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేసిన వివరాల మేరకు.. వర్జీనియాకు చెందిన బ్రియాన్‌ ఆంథోనీ జోయ్‌ శనివారం అక్కడి ఓ జిమ్‌కు వెళ్లాడు. వర్కవుట్లు చేయటం అయిపోయిన తర్వాత ఉమెన్స్‌ లాకర్‌ రూం(అమ్మాయిలు బట్టలు మార్చుకునే, దాచుకునే గది)లోని సీలింగ్‌పై నక్కి కూర్చున్నాడు.. అమ్మాయిలు ఏవరైనా బట్టలు మార్చుకుంటే చూద్దామని. కొద్దిసేపటి తర్వాత అతడి బరువు తాళలేకపోయిన సీలింగ్‌ షీటు ఊడిపోయింది. దీంతో అతడు పది అడుగుల ఎత్తునుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు. అదే సమయంలో గదిలోకి వచ్చిన ఓ అమ్మాయి అతడు పైనుంచి కిందపడటంతో బిత్తరపోయింది.

* ఆగ్రహావేశంతో ఊగిపోయిన అన్నలు.. తమ తమ్ముళ్లపై దాడి చేయడంతో వారు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోసిగి, ఆస్పరి మండలం చిన్నహోతూరులో చోటుచేసుకున్నాయి. కోసిగిలో దినకర్మ విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ.. ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. మాటామాటా పెరిగి అన్న.. తమ్ముడిని బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో నివాసముంటున్న మూకయ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడు రోజుల క్రితం తండ్రి మూకయ్య మృతి చెందడంతో పెద్ద కుమారుడితోపాటు, తిక్కయ్య, వీరేష్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం దినకర్మ చేయాల్సి ఉంది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన తిక్కయ్య తన తమ్ముడు వీరేష్‌ను బలంగా కొట్టాడు. వీరేష్‌(32) అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుడు నిర్ధరించారు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిక్కయ్య పరారీలో ఉన్నట్లు ఎస్సై ధనుంజయ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

* తనను జైలుకు పంపిందన్న కక్ష గట్టి వివాహితపై దాడి చేసి పారిపోయిన అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన రాహుల్‌ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ శివారు గుర్రంగూడలో ఉండే వివాహితపై సోమవారం సాయంత్రం నిందితుడు గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం పరారైన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు నాలుగు బృందాలతో గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు

* మూఢభక్తితో కన్నకూతుళ్లను చంపుకొన్న చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన దంపతులు పురుషోత్తం, పద్మజలను బుధవారం ఉదయం పోలీసులు విశాఖ మానసిక చికిత్సాలయానికి తరలించారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టు చేసిన అనంతరం నిందితులను మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. వారి మానసిక స్థితి బాగా లేకపోవడంతో ఇటీవల నిందితులను తిరుపతి రుయాకు తరలించారు. పరీక్షించిన వైద్యులు పురుషోత్తం, పద్మజకు కస్టోడియన్‌ కేర్‌ కావాలని సూచించారు.