Business

₹5000కోట్ల కాంట్రాక్టుకు GMR పోటీ

₹5000కోట్ల కాంట్రాక్టుకు GMR పోటీ

దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్‌ గ్రూపు, ఇప్పుడు దిల్లీ రైల్వే స్టేషన్‌ను కూడా నవీకరించి, నిర్వహించాలని భావిస్తోంది. ఇతర కంపెనీలతో పోటీపడి ఈ అవకాశాన్ని దక్కించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (ఆర్‌ఎల్‌డీఏ), రిక్వెస్ట్‌ ఫర్‌ కొటేషన్‌ (ఆర్‌ఎఫ్‌క్యూ) ఆహ్వానించగా, దానికి పలు సంస్థలు స్పందించాయి. అందులో జీఎంఆర్‌ హైవేస్‌ ఒకటి. దీంతో పాటు అదానీ రైల్వేస్‌ ట్రాన్స్‌పోర్ట్‌, అరేబియన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, కల్పతరు పవర్‌ ట్రాన్సమిషన్‌, ఒమాక్సే సహా మరికొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఇది దాదాపు రూ.5,000 కోట్ల (680 మిలియన్‌ డాలర్లు) విలువైన ప్రాజెక్టు. నాలుగేళ్లలో పూర్తిచేయాలి. దీన్ని చేపట్టిన సంస్థకు 60 ఏళ్ల పాటు రైల్వే స్టేషన్‌ నిర్వహణ- అజమాయిషీకి అవకాశం ఉంటుంది. గోపురం (డోమ్‌) ఆకారంలో రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దాలని, స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల కోసం రెండు భవనాలు, వెళ్లే వారి కోసం మరో రెండు భవనాలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆఫీసులు, హోటళ్లు, రిటైల్‌ వర్తక కేంద్రాల కోసం 40 అంతస్తుల ఎత్తులో రెండు భవనాలు నిర్మించాలి. దిల్లీ రైల్వే స్టేషన్‌కు 120 హెక్టార్ల మాస్టర్‌ప్లాన్‌ ప్రాంతం ఉండగా, ఇందులో 88 హెక్టార్లను మొదటి దశలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీనికి అవసరమైన అనుమతులను త్వరితగతిన తీసుకునే నిమిత్తం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఛైర్మన్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు.