Fashion

తెలంగాణాలో కోటి బతుకమ్మ చీరల తయారీ

తెలంగాణాలో కోటి బతుకమ్మ చీరల తయారీ

ప్రభుత్వం ఏటా పంపిణీ చేసే బతుకమ్మ చీరలు ఈ ఏడాది మరింత ఆకర్షణీయ డిజైన్లతో రూపొందనున్నాయి. సాధారణ మరమగ్గాలకు డాబీ, జకాట్‌ పరికరాలను జోడించి ఆధునికీకరించిన వాటిపైనే ఉత్పత్తి చేయాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ నిర్ణయించింది. దీంతో సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమలో ఈ పరికరాలు అమర్చిన ఆధునిక మరమగ్గాలు ఎన్ని ఉన్నాయన్న అంశంపై ఇటీవల ప్రత్యేక సర్వే నిర్వహించారు. టెక్స్‌టైల్‌ పార్కులో 1,200, పట్టణంలో 10,800 ఆధునిక మరమగ్గాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్ల కోసం వస్త్రోత్పత్తిదారులు ఇప్పటికే చెన్నై, భీవండి, సూరత్‌ల నుంచి డాబీ, జకాట్‌ ఆధునిక పరికరాలను కొనుగోలు చేసి వాటిని యంత్రాలకు అమర్చుకున్నారు. వీటిపైనే ప్రభుత్వం నిర్ణయించిన డిజైన్లతో బతుకమ్మ చీరల ఉత్పత్తి జరుగనుంది. సిరిసిల్లలోని వస్త్రోత్పత్తి పరిశ్రమ ఈ ఏడాది 9 నెలల ముందు నుంచే చీరల ఉత్పత్తిని ప్రారంభించింది. గతేడాది 22 వేల మరమగ్గాలపై కోటి చీరలు ఉత్పత్తి చేయగా.. ఈసారి మరమగ్గాలను 12 వేలకు కుదించారు. ఒక్కో కార్ఖానాలో సామర్థ్యాన్ని బట్టి కనిష్ఠంగా రెండు, గరిష్ఠంగా 4 మరమగ్గాలపై చీరలు, మిగతా వాటిపై ఇతర ఆర్డర్లు ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు రూపొందించారు. బతుకమ్మకు కోటి చీరల ఉత్పత్తి లక్ష్యం కాగా.. ఇప్పటికే రెండు విడతలుగా 57.77 లక్షల చీరల ఆర్డర్లను ఇచ్చారు.