Sports

నేర బుద్ధి….ధనార్జన యావ తగ్గని అజారుద్దీన్

శివాజియాదవ్‌, అభినవ్‌కుమార్‌, అహ్మద్‌ ఖాద్రి.. బుధవారం సాయంత్రం వరకు హైదరాబాద్‌ జట్టు సెలెక్టర్లు! అరవింద్‌శెట్టి, అన్వర్‌ అహ్మద్‌ఖాన్‌..బుధవారం సాయంత్రం నుంచి రాత్రి 8.30 మధ్యలో హైదరాబాద్‌ సెలెక్టర్లు!

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహణ, పరిపాలన, సెలెక్షన్‌ ప్రక్రియ ఎలా ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది! హెచ్‌సీఏలో అవినీతి, అక్రమాల గురించి ఎన్నో కథలు వినిపిస్తాయి. మరెన్నో అవకతవకలు కనిపిస్తాయి. కానీ హెచ్‌సీఏ పెద్దలంతా ఈస్థాయిలో ఆటను భ్రష్టుపట్టించడం మాత్రం ఊహకందనిది.

ఈనెల 20న విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీ ప్రారంభమవుతుందని దాదాపు నెల రోజుల ముందే అన్ని రాష్ట్రాల సంఘాలకు బీసీసీఐ సమాచారం అందించింది. గురువారం రాత్రిలోపు హైదరాబాద్‌ జట్టు సూరత్‌కు చేరుకోవాలని.. శనివారం ఉదయం బయో బబుల్‌లో రిపోర్ట్‌ చేయాలని హెచ్‌సీఏకు సూచించింది. జట్టు బయల్దేరడానికి సరిగ్గా 24 గంటల ముందు హెచ్‌సీఏ పెద్దలు చక్రం తిప్పారు. అప్పటికే ఎంపిక చేసిన జట్టుకు మమ అనిపించేందుకు బుధవారం సెలెక్షన్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సెలెక్టర్లు శివాజియాదవ్‌, అభినవ్‌, ఖాద్రిలకు సమాచారం ఇవ్వగా.. తమను బలిపశువుల్ని చేయొద్దంటూ చేతులెత్తేశారు. హెచ్‌సీఏ పెద్దలు రాసిచ్చిన జట్టును ఎంపిక చేయలేమని స్పష్టంచేశారు. సాయంత్రం వరకు వారిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అప్పటికప్పుడు ముగ్గురు మాజీ ఆటగాళ్లు అరవింద్‌శెట్టి, హబీబ్‌ అహ్మద్‌, అన్వర్‌లకు ఫోన్‌లు చేసి పిలిచారు. మీరే సెలెక్టర్లంటూ చెప్పారు. హెచ్‌సీఏ పెద్దల ప్రతిపాదనను తిరస్కరించిన హబీబ్‌ అహ్మద్‌.. సెలెక్షన్‌ కమిటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో హెచ్‌సీఏ పెద్దలు సిద్ధం చేసిన 22 మంది ఆటగాళ్లు, ఆరుగురు స్టాండ్‌బైల జాబితాకు మిగతా ఇద్దరు సెలెక్టర్లు ఆమోదముద్ర వేశారు. గురువారం హైదరాబాద్‌ జట్టు సూరత్‌ కూడా చేరుకుంది!

హెచ్‌సీఏ పెద్దలు, ఇద్దరు సెలెక్టర్లు కలిసి ఎంపిక చేసిన జట్టులో ఎవరున్నారో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు! జట్టులోని అత్యధికులు కార్యవర్గ సభ్యుల కుమారులు, వారి సంబంధీకులు.. క్లబ్‌ల కార్యదర్శుల పిల్లలు.. సంపన్న కుటుంబాలకు చెందినవాళ్లే. ఎ-డివిజన్‌ లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్‌-5లో ఒక్కరికి కూడా జట్టులో అవకాశం దక్కలేదు. వరుణ్‌ గౌడ్‌ (788), రోహిత్‌ రాయుడు (741), అక్షత్‌రెడ్డి (726), యశ్‌ కపాడియా (706), జునైద్‌ అలీ (704)కి నిరాశ ఎదురైంది. అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-3 బౌలర్లలో ఇద్దరికి చోటు కల్పించలేదు. ఆశిష్‌ (36 వికెట్లు) ఎంపికవగా.. అర్జున్‌ (45 వికెట్లు), విద్యానంద్‌రెడ్డి (32 వికెట్లు)కి మొండిచేయి చూపారు. జట్టులో కొన్ని బెర్తులు సొంతవాళ్లకు ఇచ్చుకోగా.. మరికొన్ని స్థానాలు అమ్ముడుపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిభ ప్రాతిపదిక కానప్పుడు ఇక లీగ్‌ మ్యాచ్‌లతో పనేంటని ఆటగాళ్లు ప్రశ్నిస్తున్నారు. హెచ్‌సీఏలోని పెద్దలే కలిసికట్టుగా తమకు అన్యాయం చేస్తుంటే.. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితి వారిది.

ఐదుగురిపైనే అందరి వేళ్లు!: హైదరాబాద్‌ క్రికెట్‌ ప్రస్తుత దుస్థితి.. హెచ్‌సీఏ పరిపాలన ఇంతలా దిగజారిపోడానికి అధ్యక్షుడు అజహరుద్దీన్‌, ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌, కార్యదర్శి విజయానంద్‌, సంయుక్త కార్యదర్శి నరేశ్‌ శర్మ, కోశాధికారి సురేందర్‌ అగర్వాల్‌లే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అజహర్‌ ఆధ్వర్యంలోని ఎపెక్స్‌ కౌన్సిల్‌ 18 నెలల క్రితం హెచ్‌సీఏ పగ్గాలు చేపట్టింది. జస్టిస్‌ లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో అంబుడ్స్‌మన్‌, క్రికెట్‌ సలహా కమిటీ, సెలెక్టర్లు, కోచ్‌లను ఎంపిక చేయాలి. ఇప్పటి వరకు ఏజీఎం నిర్వహించకుండా హెచ్‌సీఏ పెద్దలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అంబుడ్స్‌మన్‌ను నియమిస్తే హెచ్‌సీఏలో అత్యధికుల ఆటలు సాగవని, విరుద్ధ ప్రయోజనాల నిబంధనతో తమ పిల్లలు ఏ జట్టుకు ఎంపిక కాలేరని.. అందుకే జాప్యం చేస్తున్నారని ఓ క్లబ్‌ కార్యదర్శి విమర్శించాడు. మరోవైపు జట్టు ఎంపికలో అవకతవకలకు పాల్పడుతున్న హెచ్‌సీఏపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో అఖిల భారత షెడ్యూల్‌ కులాల, తెగల సంఘాల సమాఖ్య ఫిర్యాదు చేసింది.

‘‘హెచ్‌సీఏ ఎపెక్స్‌ కమిటీ సభ్యులు ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసి సంతకం పెట్టమంటున్నారు. విజయ్‌ హజారే టోర్నీకి కూడా వాళ్లే జట్టును సిద్ధం చేశారు. చాలామంది ఆటగాళ్లను ఎంపిక చేయడం కుదరదని చెప్పా. హెచ్‌సీఏ పెద్దల కోసం నేను బలిపశువును కాలేను. అందుకే సెలెక్షన్‌ కమిటీ నుంచి తప్పుకున్నా’’ అని సెలెక్షన్‌ కమిటీ సమావేశానికి దూరంగా ఉన్న సెలెక్టర్‌ చెప్పాడు. ‘‘అధ్యక్షుడు అజహర్‌ విదేశాల నుంచి బుధవారమే వచ్చాడు. అజహర్‌ ఆదేశాల మేరకు అరవింద్‌శెట్టి, అన్వర్‌లు జట్టును ఎంపిక చేశారు. గురువారం జట్టు సూరత్‌కు వెళ్లింది. జట్టు కూర్పులో భాగంగా కొందరికి అవకాశం దక్కలేదు’’ అని కార్యదర్శి విజయానంద్‌ తెలిపాడు.

*** జట్టిదే
తన్మయ్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), సందీప్‌, తిలక్‌ వర్మ, హిమాలయ్‌ అగర్వాల్‌, మీర్‌ జావీద్‌ అలీ, అనిరుధ్‌, సీవీ మిలింద్‌, రవితేజ, అజయ్‌ దేవ్‌గౌడ్‌, తనయ్‌ త్యాగరాజన్‌, అబ్దుల్‌ ఖురేషీ, ఆశిష్‌ శ్రీవాస్తవ్‌, మిఖిల్‌ జైస్వాల్‌, ప్రతీక్‌ రెడ్డి, మల్లిఖార్జున్‌, శ్రేయస్‌, రక్షణ్‌ రెడ్డి, యశ్‌ గుప్తా, సాత్విక్‌ రెడ్డి, భగత్‌ వర్మ, అఖిలేష్‌ రెడ్డి, మెహదీ హసన్‌; స్టాండ్‌ బై: అనికేత్‌ రెడ్డి, సూర్య ప్రసాద్‌, అలంకృత్‌ అగర్వాల్‌, అనిరుధ్‌ రెడ్డి, అమన్‌ షెరోన్‌, అబ్దుల్‌ అద్నాన్‌.