Devotional

వసంత పంచమి విశిష్టత ఏమిటి?

వసంత పంచమి విశిష్టత ఏమిటి?

అన్ని సిరులకి మూలాధారం విద్య. సమస్త విద్యల్ని అనుగ్రహించే తల్లి, అన్ని కళలకు శాస్త్రాలకు, వృత్తులకు, మేధస్సుకు, వాక్బుద్ది కి అన్నింటికీ అధిష్టాన దేవత సరస్వతి దేవి. మాఘశుద్ద పంచమినాడు సరస్వతి దేవి ఆవిష్కరించిన రోజు దీనినే శ్రీ పంచమి అని, వసంత పంచమి అని, మదన పంచమి అని వ్యవహరిస్తారు.

మకర సంక్రమణం తరువాత క్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో ప్రకాసిస్తాయి. శ్వేత వస్త్రాలని ధరించినదై హంస వాహనం తో తెల్లటి తామర పుష్పం పై కొలువుతీరి ఉంటుంది. నాలుగు చేతులు నాలుగు దిక్కుల్లో వ్యాపించిన ఆ తల్లి శక్తిని సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి. ఎడమ చేతి లోని పుస్తకం సమస్త భౌతిక విద్యలకు సంకేతమని తెలియచేస్తుంది. కుడి చేతిలోని అక్షమాల సమస్త ఆధ్యాత్మిక విద్యలని ఆత్మ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. హస్త భూషణమైన వీణ, సకల కళల అధిదేవత గా ప్రకటిస్తుంది, ఆ తల్లి చేతిలోని పాశాంకుశాలు మనిషి లోని మనోకాలుష్యాన్ని హరింపజేసే ఆయుధాలు గా చెప్పబడతాయి. పాలని నీటిని వేరు చేసే హంస మంచి చెడుల విచక్షణ జ్ఞానం తో మసులుకోవాలనే సంకేతాన్ని తెలియచేస్తుంది.

ఈ రోజు సరస్వతి దేవిని శ్వేత పుష్పాలతో పూజించి, ధవళ వస్త్రాలని సమర్పించి చందనాన్ని, క్షీరాన్నాన్ని, పేలాలు, నువ్వుండలు, అటుకులు చెరుకు ముక్కల్ని నివేదన చేయాలనీ స్వయం గా శ్రీమహావిష్ణువు నారదునికి వివరించినట్టు దేవి భాగవతం ద్వారా తెలుస్తుంది. పెరుగు, వెన్న, బెల్లం, తేనె, చక్కర, కొబ్బరికాయ, రేగుపండు వంటి వాటిని నివేదిస్తే ఆ తల్లి ప్రసన్నురాలవుతుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. పలు వృత్తుల వారు ఈ రోజు సరస్వతి దేవి ని పూజిస్తారు. ఎవరి వృత్తి వారికి, సరస్వతి రూపం లో ఉంటుంది కాబట్టి వారి వారి పని ముట్లకి పూజ చేస్తారు. పలు వృత్తుల వారు వారి జీవనోపాధి అయినటువంటి వాటిని పూజిస్తారు.