Editorials

మర్డర్ వీడియో సాక్ష్యంగా పనిచేస్తుంది

న్యాయవాదులు వామనరావు దంపతుల జంటహత్యలపై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియో క్లిప్పింగ్‌లు చట్టప్రకారం సాక్ష్యాలుగా పనికొస్తాయా? ఇప్పుడు చాలామందిలో మెదులుతున్న ప్రశ్న ఇది. ఇవి సాక్ష్యాలుగా చెల్లుబాటవుతాయని, అయితే కోర్టుకు సమర్పించిన వీడియోల్లో ఎలాంటి ఎడిటింగ్‌ జరగలేదనే విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ సాక్ష్యానికి మూలధారమైన పరికరం, దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ ఆమోదయోగ్యమేనంటూ గతంలో ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించిందని న్యాయవాది టి.ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి తెలిపారు. అయితే వీడియో, ఫొటో ఎవరు తీశారో ఆ వ్యక్తిని కూడా సాక్షిగా పిలవాల్సి ఉంటుందన్నారు. చనిపోతున్న వ్యక్తి ఆఖరు మాటలను నమోదు చేయడానికి డాక్టరు, మేజిస్ట్రేట్‌లే అయి ఉండాల్సిన అవసరంలేదన్నారు. ఎవరు రికార్డు చేసినా అది మరణ వాంగ్మూలమే అవుతుందని హైకోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మొబైల్‌ ఫోన్‌లోని సాక్ష్యం చెల్లుబాటవుతుందని చెప్పారు. కత్తిపోట్లకు గురై చావుబతుకుల మధ్య ఉన్న వామన్‌రావు చివరిగా కుంట శ్రీను పేరు చెప్పినట్లు ప్రచారంలో ఉండగా, ఆయన నోటి వెంట పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు పేరు కూడా వినిపించినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌ కావడం కలకలం రేపుతోంది. రోడ్డుపై నెత్తుటి గాయాలతో పడి ఉన్న వామన్‌రావును గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీశారు. ఐదు సెకన్ల నిడివి గల ఆ వీడియోలో ఆయన పుట్ట మధు పేరు చెబుతున్నట్లుగా ఉంది. అయితే ఆ వీడియో మార్ఫింగ్‌ చేసిందా..? లేక నిజమైనదేనా? అనేది తేలాల్సి ఉంది. పోలీసులు ఈఅంశంపై దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాత్రం ఐజీ నాగిరెడ్డి ఈ కేసులో పుట్ట మధు ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని స్పష్టం చేశారు.