Business

అశోక్ లేల్యాండ్ మేడిన్ బెజవాడ

అశోక్ లేల్యాండ్ మేడిన్ బెజవాడ

విజయవాడకు సమీపంలోని మల్లవల్లి గ్రామం వద్ద అశోక్‌ లేల్యాండ్‌ నెలకొల్పిన బస్సుల తయారీ యూనిట్లో శుక్రవారం ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ తయారయ్యే అశోక్‌ లేల్యాండ్‌ బస్సులు దేశవ్యాప్తంగా సరఫరా అవుతాయి. దాదాపు 75 ఎకరాల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ యూనిట్‌ను నెలకొల్పారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెళ్లు, ఎల్‌ఈడీ లైటింగ్‌, జీరో డిస్‌ఛార్జి.. వంటి సదుపాయాలతో పాటు యూనిట్‌ లోపల కాలుష్యానికి తావులేని రీతిలో బ్యాటరీతో నడిచే వాహనాలు మాత్రమే వినియోగిస్తున్నారు. బీఎస్‌-6 ప్రమాణాలు గల బస్సులనే విజయవాడ యూనిట్లో తయారు చేయనున్నట్లు అశోక్‌ లేల్యాండ్‌ అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ యూనిట్‌కు ఏటా 4,800 బస్సులు అందించగల సామర్థ్యం ఉంది. ‘‘ఈ యూనిట్లో అత్యాధునిక శిక్షణా కేంద్రం, అధునాతన సర్వీస్‌ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాం’’ అని అశోక్‌ లేల్యాండ్‌ వెల్లడించింది. మల్లవల్లిలోని మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో బస్సుల తయారీ యూనిట్‌ నిర్మాణాన్ని ఈ సంస్థ 2018 మార్చిలో చేపట్టింది. దీనిపై దాదాపు రూ.170 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ఈ యూనిట్‌ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అన్ని రకాల బస్సులు తయారు చేసేందుకు అనువుగా ఈ ప్లాంటును నిర్మించారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ బస్సులను సైతం అసెంబుల్‌ చేసేందుకు వీలుగా ఈ ప్లాంటును తీర్చిదిద్దారు. దక్షిణ భారతదేశంతో పాటు తూర్పు, మధ్యభారత ప్రాంతాల మార్కెట్‌కు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో విజయవాడలో పూర్తి బస్సుల (ఫుల్లీ బిల్ట్‌) తయారీ యూనిట్‌ను అశోక్‌ లేల్యాండ్‌ ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఈ యూనిట్లో పూర్తి బాడీతో కూడిన లారీలు సైతం తయారు చేసే అవకాశం ఉందని తెలిసింది.