Business

ఫాస్టాగ్ ఉచితం-వాణిజ్యం

ఫాస్టాగ్ ఉచితం-వాణిజ్యం

* కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. ఉచితంగానే ఫాస్టాగ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2021 మార్చి 1 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 770 టోల్ ప్లాజాలలో (స్టేట్ ప్లాజాతో సహా) ఉచితంగానే ఫాస్టాగ్ పొందవచ్చు అని ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. దీనితో వాహనదారులకు రూ.100 ఆదా కానుంది. జాతీయ రహదారులపై నడిచే వాహనాల యూజర్ల ఫాస్టాగ్ వినియోగించడాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

* కరోనా కారణంగా వ్యాపారాలు డీలా పడి, ఉద్యోగాలు పోయి ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. దీనితో కొనుగోలు శక్తిని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు భారీ ఉద్దీపన పథకాల ప్రకటిస్తున్నాయి. ఉద్దీపనల వల్ల కరెన్సీ విలువ పడిపోవడం వల్ల బ్యాంకింగ్‌ రంగం సుస్థిరతపై అనుమానాలు రేకెత్తడం మొదలయ్యాయి. ఇటువంటి సమయంలో బిట్‌కాయిన్ ధర మాత్రం రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. చాలా మంది పెట్టుబడి దారులు బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలోని అతి సంపన్నులలో ఒకరైన టెస్లా కంపెనీ అధిపతి ఎలాన్‌ మస్క్‌ బిట్‌కాయిన్ మార్కెట్ లో 150 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.

* దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇప్పుడు ఎస్‌బీఐ ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుంచే 5 నిమిషాలలో ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్, గ్రీన్ పిన్ జనరేట్ చేసుకోవచ్చునని తెలిపింది. దీని కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే ఐవీఆర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ టోల్ ఫ్రీ ఐవిఆర్ సిస్టమ్ ద్వారా 1800 112 211 లేదా 1800 425 3800 కాల్ చేయాలి ఆ తరువాత కింద పేర్కొన్న విధంగా చేయాల్సి ఉంటుంది.

* డిసెంబరులో ఈపీఎఫ్‌ఓ పేరోల్‌లో కొత్తగా 12.54 లక్షల మంది నికర చందాదారులు చేరారు. వీరిలో 8.04 లక్షల మంది కొత్తవారు కాగా.. 4.5 లక్షల మంది ఈపీఎఫ్‌ఓ నుంచి వైదొలిగి తిరిగి చేరినవారు. 2019, డిసెంబరుతో పోలిస్తే సంఘటిత రంగంలో 24 శాతం వృద్ధి నమోదైంది. ఇక నవంబరుతో పోలిస్తే 44 శాతం చేరికలు పెరిగాయి. కొవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి డిసెంబరు, 2020) 53.70 లక్షల మంది నికర చందాదారులు ఈపీఎఫ్‌ఓలో చేరారు. రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికం చేరికల్లో 22 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర కార్మిక శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.