WorldWonders

నైజీరియాలో 317మంది కిడ్నాప్

317 Girl Students Kidnapped In Nigeria

ఉత్తర నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. సాయుధులైన గుర్తు తెలియని దుండగులు బాలికల వసతి గృహంపై దాడి చేసి 317 పాఠశాల విద్యార్థినులను అపహరించారు. వీరంతా 10 నుంచి 13 ఏళ్ల వయసు వారేనని అక్కడి మీడియా వర్గాల సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జంఫారా రాష్ట్రంలోని జంగేబే గ్రామంలో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలపై దుండగులు దాడి చేసి వసతి గృహంలోని బాలికలను అపహరించినట్లు తెలిపారు. విద్యార్ధినులను కాపాడేందుకు జంఫారా పోలీసులు, నైజీరియా మిలిటరీ సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అక్కడి పోలీసు అధికార ప్రతినిధి మహ్మద్‌ షేహు తెలిపారు. ఈ వారంలో ఇది రెండో ఘటన. మూడు రోజుల క్రితం బోకోహారం ఉగ్రవాద ముఠాకు చెందిన వారుగా అనుమానిస్తున్న కొందరు దుండగులు మిలటరీ దుస్తుల్లో వచ్చి కగరలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులను తుపాకులతో బెదిరించి స్థానిక అడవిలోకి లాక్కెళ్లారు.