Devotional

దుర్గ గుడిలో ఈ అక్రమాల విచిత్రాలు వింటే….

Here are the list of frauds scams and tantrik puja info in durga temple

కృష్ణాతీరాన వెలిసిన ఇంద్రకీలాద్రి విశిష్టమైనది.. శక్తి మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. ఈ కొండమీద కనకదుర్గాదేవి, మల్లేశ్వరస్వామి స్వయంగా అవతరించారని స్థలపురాణం చెబుతోంది. రాష్ట్రంలోనే రెండో పెద్దదైన ఈ దేవస్థానంలో అడుగడుగునా అక్రమాలు.. అవినీతి.. ఆశ్రిత పక్షపాతం రాజ్యమేలుతున్నాయి.

*** వివాదాలే..
అమ్మవారి కిరీటం దొంగతనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1999లో గర్భగుడి తాళాలు పగలగొట్టి అమ్మవారి బంగారు కిరీటం (1.5కేజీలు) చోరీ చేశారు. దాదాపు రెండేళ్ల దర్యాప్తు తర్వాత ఓ పాత నేరస్థుడు సాహును అరెస్టు చేశారు. కిరీటం రికవరీ చేశారు. కానీ ఆ కిరీటం తాను చేయించినది కాదని దాత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు.
* గర్భగుడిలో అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరగడం భక్తుల్లో తీవ్ర అలజడి రేపింది. ఐఏఎస్‌ అధికారిణి సూర్యకుమారి ఈవోగా ఉన్నప్పుడే ఈ పూజలు జరిగాయి. దీనిపై నాటి సీపీ నివేదిక అందించారు. అర్చకుడి సస్పెన్షన్‌, ఈవో బదిలీ తర్వాత అంతా గప్‌చుప్‌ అయింది. తాంత్రిక పూజలు ఎవరు.. ఎందుకు చేశారో ఇప్పటికీ తేలలేదు.
* గత ఏడాది సెప్టెంబరులో అమ్మవారి వెండిరథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహాలలో మూడు చోరీ అయ్యాయి. మహామండపంలో ఉన్న ఈ రథం నుంచి సింహాలను చోరీ చేశారు. ఇటీవల కరిగించిన వెండి రికవరీ చేశారు.
* 2004లో అమ్మవారి గర్భగుడి గోపురాన్ని బంగారంతో తాపడం చేస్తూ అసంపూర్తిగా వదిలేశారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. రాగితో కల్తీ జరిగిందన్న వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంలో రూ.లక్షలు వృథా అయ్యాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీన్నీ ఏమీ తేల్చలేదు.
* 2007-08లో ఘాట్‌రోడ్డులో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. దీంతో రూ.50 కోట్లతో ఘాట్‌రోడ్డు విస్తరణ, రిటైనింగ్‌ గోడలు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. పనులు అసంపూర్తిగా వదిలేశారు.
* గత ఏడాది దసరా ఉత్సవాల సమయంలో సీఎం రాకకు కొద్ది నిమిషాల ముందు కొండరాళ్లు పడ్డాయి. తర్వాత దుర్గాఘాట్‌ ఎదురుగా ఒక రిటైనింగ్‌ గోడ కట్టారు. రూ.3కోట్ల అంచనా వ్యయానికి రూ.5కోట్లు ఖర్చు చేశారు. దీనిపై విచారణ జరిపి నాణ్యత లేదని తేల్చినా.. చర్యలు లేవు.
* తిరుపతి క్యూకాంప్లెక్సు తరహాలో రూ.75 కోట్లతో మహామండప నిర్మాణం తలపెట్టారు. నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది. ఆరు అంతస్తులు కట్టారు. ఇందులో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. పరిహారం పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు. 2016లో కొన్ని కట్టడాలను కూల్చినందుకు రూ.56 కోట్ల పరిహారం చెల్లించాల్సి వచ్చింది.
* నాలుగేళ్ల క్రితం నెయ్యి కుంభకోణం వెలుగుచూసింది. ప్రసాదాలకు వినియోగించాల్సిన నెయ్యిని భారీ మొత్తంలో దారి మళ్లించారు. ఎవరినీ బాధ్యులుగా చేయలేదు.
* భక్తులు అమ్మవారికి రూ.లక్షలు విలువచేసే చీరలు కానుకగా ఇస్తారు. గతంలో పెద్దఎత్తున చీరలు మాయం అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక విలువైన చీర మాయంపై పాలకవర్గ సభ్యురాలిని తొలగించి, పోలీసు కేసు పెట్టారు.
* అర్జున వీధిని కుదించేశారు. 100 అడుగుల రోడ్డు కాస్తా.. 30 అడుగులు చేసి గోడ కట్టించేశారు. ఇది రాజకీయంగా దుమారం రేపింది. దీనివల్ల అక్కడి ఆస్తుల విలువ తగ్గిపోయింది.
* ఇటీవల ఓ పాలకవర్గ సభ్యురాలి వాహనంలో తెలంగాణ మద్యం సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడటంతో కేసు నమోదు చేశారు.
* ప్రతినెలా అమ్మవారి హుండీ లెక్కిస్తారు. ఇక్కడ కానుకల్లో వచ్చిన బంగారాన్ని కొందరు కాజేస్తారు. లెక్కించేటప్పుడే కాగితాల్లో చుట్టి బయట పడేస్తారు. అక్కడ ముందుగానే ఉన్న వ్యక్తి వాటిని సేకరిస్తుంటారు. పాలకవర్గం లోపాలు, నిర్వాహక వ్యవస్థ అవినీతి దీనికి కారణాలుగా అనిశా తేల్చింది.
* దుర్గగుడిలో కొబ్బరికాయల నుంచి క్లోక్‌రూం వరకు.. సరకుల నుంచి పారిశుద్ధ్యం వరకు ప్రతి టెండర్‌లోనూ అధికారులు, గుత్తేదారుల మధ్య అంతర్గత ఒప్పందాలు ఉంటాయి. తాము అనుకున్న వారికే టెండర్లు ఇవ్వడం కోసం టెండర్‌ నిబంధనలు అడ్డదిడ్డంగా మార్చేస్తారు. తమ బినామీలకు ఉన్నవే అర్హతలవుతాయి. అప్పటికీ ఎవరైనా అర్హత సాధిస్తే.. వారిని తప్పించేందుకు కొత్త నిబంధనలు తెరపైకి వస్తాయి. తాజాగా ఏసీబీ తనిఖీల్లో పారిశుద్ధ్యం, భద్రత టెండర్లలో అనేక అవకతవకలు గుర్తించారు. అమ్మవారికి భక్తులు సమర్పించే చీరల అమ్మకంపై 2016 వరకూ టెండర్ల ద్వారా ఏటా రూ.1.5 కోట్ల ఆదాయం వచ్చేది. 2017లో అప్పటి ఈవో ఈ టెండర్లను ఆపేశారు. అప్పటి నుంచి దేవస్థానమే స్వయంగా చీరలను అమ్మగా.. వార్షికాదాయం రూ.3-4 కోట్లకు పెరిగింది.
* 2015లో టోల్‌గేట్‌ టెండరు దక్కించుకున్న ఓ గుత్తేదారు గడువు ముగిసేవరకూ డబ్బులు చెల్లించలేదు. వేలంలో పాడుకున్న దానికి రెండు రెట్లు అధికంగా దండుకుని వెళ్లిపోయాడు. రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉన్నా.. ఏఈవోకు లంచాలిచ్చి తప్పించుకున్నాడు. ఇప్పటికీ అతడి నుంచి ఒక్క రూపాయి వసూలు చేయలేకపోయారు. దేవస్థానంలో ఫొటోలు తీసే కాంట్రాక్టును దక్కించుకున్న మరో గుత్తేదారు కూడా ఇలాగే 2018లో రూ.23 లక్షలకు పైగా టోకరా వేశాడు. క్లోక్‌రూం, కొబ్బరికాయల టెండర్లలోనూ కొందరు ఇలాగే డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టారు. వీరి నుంచి ఆ తర్వాత ఒక్క రూపాయీ వసూలు చేయలేదు. వీళ్లంతా ఆలయంలో కొందరు సిబ్బందికి బినామీలేనన్న ఆరోపణలున్నాయి.
* దశాబ్దాలుగా అమ్మవారి ఆలయంలో టెండర్లకు విధివిధానాలు లేవు. అన్ని టెండర్లనూ ఒకే విభాగం నిర్వహించట్లేదు. సెక్యూరిటీ టెండర్లను పరిపాలన విభాగం చూస్తుంది. అలాగే పారిశుద్ధ్య విభాగం, స్టోర్స్‌, ఇంజినీరింగ్‌ విభాగం.. ఇలా ఎవరి టెండర్లను వాళ్లే చూసుకుంటూ తమకు నచ్చిన నిబంధనలు పెట్టుకోవడంతో జవాబుదారీతనం లేకుండా పోయింది. టెండర్ల ప్రక్రియను ప్రక్షాళన చేస్తే అమ్మవారి ఆదాయానికి కోట్లలో గండిపడకుండా ఆపొచ్చు.