Sports

పోటీకి ముందు కరోనా గోల

పోటీకి ముందు కరోనా గోల

ఆల్‌ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఆరంభానికి ముందే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టోర్నీలో పోటీ పడాల్సిన భారత షట్లర్లలో ముగ్గురికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. సహాయ సిబ్బంది ఒకరు కూడా కరోనా బారిన పడ్డారు. ‘‘ముగ్గురు భారత షట్లర్లకు, సహాయ సిబ్బందిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. జురిచ్‌లో రెండు వారాల కింద స్విస్‌ ఓపెన్‌ ఆరంభమైనప్పటి నుంచి మేం ఐసోలేషన్‌లో ఉంటున్నాం. మా వాళ్లకు కరోనా ఎలా సోకిందో అర్థం కావట్లేదు’’ అని భారత జట్టు కోచ్‌ మథియాస్‌ బూ అన్నాడు. ‘‘14 రోజుల్లో మమ్మల్ని 5 సార్లు పరీక్షించారు. అన్నిసార్లూ నెగెటివ్‌ వచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా కొద్ది మందికి పాజిటివ్‌ ఎలా వచ్చిందో తెలియట్లేదు’’ అని చెప్పాడు. పాజిటివ్‌గా తేలిన షట్లర్ల పేర్లు బయటకు రాలేదు. మరి కొందరు భారత షట్లర్ల ఫలితాల్లో స్పష్టత లేదు. సైనా, కశ్యప్‌ వంటి వారు తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ‘‘ఇవేం పరీక్షలు? అంతా గందరగోళంగా ఉంది. మ్యాచ్‌లు రేపు ఆరంభమవుతున్నాయి. 30 గంటల ముందు నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఇంకా రాలేదు. రెండు రోజులుగా ప్రాక్టీస్‌ లేదు. జిమ్‌ లేదు’’ అని సైనా ట్వీట్‌ చేసింది. టోర్నీలో సింధు, సైనా సహా చాలామంది భారత క్రీడాకారులు బరిలో ఉన్నారు. అయిదో సీడ్‌ సింధు తొలి రౌండ్లో మలేసియా క్రీడాకారిణి సోనియా చియాను ఢీకొనాల్సి ఉంది. సైనా నెహ్వాల్‌ టోర్నీలో ఏడో సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఆమెకు తొలి రౌండ్లో డెన్మార్క్‌ షట్లర్‌ బ్లిచ్‌ఫెట్‌ ఎదురు కానుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌, కశ్యప్‌, ప్రణయ్‌, సమీర్‌ వర్మ బరిలోకి దిగుతున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు-చిరాగ్‌ శెట్టి, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌-అశ్విని, ప్రణవ్‌ చోప్రా-సిక్కిరెడ్డి, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పోటీ పడుతున్నారు.