Health

ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్-తాజావార్తలు

Another round of lock down in Delhi - News Roundup

* ఆగిరిపల్లి ఆంధ్ర బ్యాంకు లో కరోనా కలకలం…. మేనేజర్ కు పాజిటివ్ గా నిర్ధారణ. సిబ్బంది వైద్య పరీక్షలు. బ్యాంక్ మూసివేత.

* దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. నవంబర్‌ నుంచి కోవిడ్‌ కేసులు తగ్గినప్పటికి.. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ కూడా ఈ జాబితాలో చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించేందుకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం సిద్ధమయ్యింది. త్వరలో రానున్న హోలీ పండగ నేపథ్యంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు‌ కనిపిస్తున్నాయి. ఈనెల 28న హోలీ ఉండటంతో.. కఠిన ఆంక్షలకు విధించాలని సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో మార్చి 28 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ విధించాలని సూచించారు అధికారులు..

* పీఆర్సీపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. 30శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 30 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాజా పీఆర్సీతో 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించానని, కరోనా, ఆర్థికమాంద్యం కారణంగా పీఆర్సీ ఆలస్యం అయ్యిందన్నారు. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకి పెంచుతున్నట్టు తెలిపారు. ప్రకటన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అన్ని విభాగాల ఉద్యోగుల అందరికీ పీఆర్సీ వర్తిస్తుందన్నారు. మానవీయ కోణంలో వేతనాలు పెంచామని ఆయన అన్నారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఐదేళ్ల ప్రకారం పీఆర్సీ పెంచామన్నారు. ఇప్పటి వరకు 80 శాతం ఉద్యోగాల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. వెంటనే అంతర్ జిల్లాల బదిలీలు ఉంటాయని తెలిపారు. పెన్షనర్లు వయోపరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే, సీఎం ప్రకటన పూర్తి చేయగానే పక్కనే ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ … ఆయన దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

* 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను సోమవారం ప్రకటించారు. జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణి కర్ణిక)‌, ఉత్తమ నటుడిగా భోంస్లే చిత్రానికి గానూ మనోజ్‌ బాజ్‌పాయ్, అసురన్‌ సినిమాకు గానూ ధనుష్‌‌లను పురస్కారాలు వరించాయి. ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నాని నటించిన జెర్సీ నిలిచింది. కాగా ఫీచర్‌ ఫిల్మ్స్‌ కేటగిరీలో ఈసారి 461, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో 220 చిత్రాలు పోటీపడ్డాయి.

* జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు చెందిన రెండు సినిమాలు సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలుగు చిత్రసీమకు సంబంధించి మొత్తం ఐదు అవార్డులు వచ్చాయి. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’కి మూడు అవార్డులు, న్యాచురల్‌ స్టార్‌ నాని సినిమా ‘జెర్సీ’కి రెండు అవార్డులు దక్కాయి.

* పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు రెండు రోజులుగా కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసు మహారాష్ట్రలో కీలక పరిణామాలకు దారి తీసింది. ఏకంగా ప్రభుత్వంలో ఓ భారీ కుదుపు ఏర్పడింది. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నెలకు రూ.వంద కోట్లు వసూల్‌ లక్క్ష్యంగా పెట్టుకున్నారని ఓ మాజీ పోలీస్‌ అధికారి చేసిన ఆరోపణలపై కథ నడుస్తోంది. దీనిపై తాజాగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పందించారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ హోంమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

* కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలవుతుందని చెప్పారు. ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతుల అనంతరం మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.

* అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రభుత్వం మద్యంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం‌ పాలసీలో పెను మార్పులు తీసుకువచ్చింది. సోమవారం ఉప ముఖ్యమంత్రి మనిష్‌ శిశోడియా కొత్త మద్యం పాలసీపై మాట్లాడుతూ.. మందు తాగే చట్టబద్ధమైన వయసును 25 నుంచి 21 మార్చటానికి ప్రభుత్వం నిశ్చయించిందని అన్నారు. కొత్త నియమాల ప్రకారం రాజధానిలోని పేర్లులేని మద్యం షాపులు ఇకపై పనిచేయటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పాత మద్యం షాపులకు కూడా ఈ నియమం వర్తిస్తుందని అన్నారు. రాజధానిలోకి అక్రమ మద్యం రాకుండా అడ్డుకోవటం ద్వారా రాష్ట్ర రెవెన్యూను 20 శాతం పెంచుతామని పేర్కొన్నారు.

* ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ అమెజాన్ క్విజ్ నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులను అందిస్తుంది. నేటి (మార్చి 22) క్విజ్ ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పిన వారు రూ.10వేల అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అమెజాన్ డైలీ క్విజ్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా వచ్చే 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే.

* ఇటీవల ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తీరత్‌‌సింగ్‌ రావత్‌ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి తీరుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. మోదీని కలిసే ముందే తీరత్‌సింగ్‌ రావత్‌కు తాను కరోనా బారిన పడిన విషయం తెలియడంతో కలకలం రేపింది. అతడికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా తెలిసి ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా మహమ్మారి సోకి ఉండే అవకాశం ఉండేది.

* జాతీయ స్ధాయిలో ఉత్తమ డీజీపీతో పాటు అత్యుత్తమ పోలీసింగ్‌లో 13 జాతీయస్ధాయి అవార్డులు పొందిన నేపథ్యంలో పోలీస్‌ శాఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను సోమవారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్ధాయిలో ఉత్తమ డీజీపీతో పాటు అత్యుత్తమ పోలీసింగ్‌లో 13 జాతీయస్ధాయి అవార్డులు సాధించడంపై సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. ఆయన వెంట ఇంటెలిజెన్స్‌ డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి, డీఐజీ టెక్నికల్‌ సర్వీసెస్‌ జి. పాలరాజు తదితరులు ఉన్నారు.