DailyDose

దోపిడీకి ప్రయత్నించిన సైనికుడు అరెస్ట్-నేరవార్తలు

Indian Army Soldier Tries Theft And Gets Arrested

* విశాఖ పారిశ్రామిక వాడాలో నెలకొన్న విషాద ఛాయలు.జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ దాడి సూర్యకుమారి ఆకస్మిక మృతి.కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కార్పొరేటర్ కుటుంబ సభ్యులు. ఇటీవల జరిగిన మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో 61వ వార్డు నుండి గెలుపొందిన సూర్యకుమారి.

* ఆర్మీలో పనిచేస్తున్న ఓ సైనికుడు వ్యాపారిని బెదిరించి పోలీసులకు పట్టుబడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్పీ బి.రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మండలం బంటువానివలస గ్రామానికి చెందిన చందనా పల్లి రాజేశ్వరరావు ఆర్మీలో పనిచేస్తున్నాడు. సెలవుపై వచ్చిన అతడు స్థలం కొనుగోలు, విక్రయంలో రూ.22 లక్షలు నష్టపోయాడు. దాన్ని భర్తీ చేసుకునేందుకు మావోయిస్టు నాయకుడిగా అవతారమెత్తాడు. ఉత్తరప్రదేశ్‌లో కొనుగోలు చేసిన పిస్టల్‌తో పార్వతీపురానికి చెందిన బంగారు వ్యాపారి ఇందుపూరు చినగుంపస్వామి అలియాస్‌ బాబు ఇంటి కిటికీ అద్దాలపై ఈ నెల 6న అర్ధరాత్రి కాల్పులు జరిపాడు. మరుసటి రోజు వ్యాపారికి ఫోన్‌ చేసి జార్ఖండ్‌ మావోయిస్టు కమాండర్‌గా పరిచయం చేసుకున్నాడు.కాల్పులు జరిపినది తనేనని, రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఈ విషయంపై పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు రూ.1.5 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నిందితుడు వ్యాపారికి ఆదివారం ఫోన్‌చేసి డబ్బును విక్రం పురం–డంగభద్ర గ్రామాల మధ్యలోని కొండ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పాడు. పోలీసులు మాటువేసి నిందితుడిని పట్టుకున్నారు.

* జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు వచ్చిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున భద్రతా దళాలు ఆ ప్రదేశాన్ని దిగ్బంధించి తనిఖీలు ప్రారంభించాయి. భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్‌‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. తొలుత భద్రతాదళాలపైకి ముష్కరులు కాల్పులు జరపడంతో మన జవాన్లు దీటుగా జవాబిచ్చారు. కాగా, మృతిచెందిన నలుగురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారు కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని వారు ట్వీట్‌లో వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు.

* విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లక్ష్మీ నారాయణపురం గ్రామప్రజలు. బొడికొండ త్రవ్వకల లీజు అనుమతి రద్దు చెయ్యాలి అని గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. పార్వతీపురం ప్రధాన రహదారిపై ర్యాలీగా వెళ్లి నినాదాలు చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం పార్వతిపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు వినతి పత్రం అందజేశారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ బోడి కొండ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కొండ దేవతగా కొలుస్తున్నారు. బొడికొండ గ్రానైట్ తవ్వకాల వల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడతాయి. అలాగే గిరిజనుల పొడి వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కు ప్రవీణ్ కుమార్ సిపిఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి శ్రీరామ్ మూర్తి పట్టణసిపిఐ నాయకులు సంఘం మరియు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.