Sports

సూర్యాపేటలో కుప్పకూలిన గ్యాలరీ

Suryapeta 2021 Kabaddi Tournament Gallery Collapses

సూర్యాపేటలో 47వ జూనియర్‌ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలి సుమారు 100 మందికి పైగా ప్రేక్షకులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు, 108 సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించారు. ప్రమాద సమయంలో గ్యాలరీల్లో దాదాపు 1500 మంది ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. గ్యాలరీ కూలిపోవడానికి నిర్మాణంలో లోపమా? మరేదైనా కారణమా? అన్నది తేలాల్సి ఉంది. ఈ గ్యాలరీల ఏర్పాటుకు 90టన్నుల ఇనుము, 60టన్నుల కలపను వినియోగించారు. అలాగే, 20అడుగుల ఎత్తు, 240 అడుగుల వెడల్పుతో మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 5000 మంది కూర్చొనేలా మొత్తం 15వేల సామర్థ్యంతో  మూడు గ్యాలరీలు నిర్మించారు. వీటికి వినియోగించిన ఇనుపరాడ్లు కొందరి కాళ్లపై పడటంతో తీవ్ర గాయాలైనట్టు సమాచారం. జాతీయ స్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీలు ఇప్పటివరకు ఎన్నడూ నల్గొండ ఉమ్మడి జిల్లాలో జరగలేదు.దీంతో ఈ పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మంగా నిర్వహించాలని భావించారు.ఈ క్రీడా పోటీల కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అయితే, ఎంత భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ క్రీడా పోటీలు మరికాసేపట్లో ఘనంగా ప్రారంభం కానున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విషాదం నింపింది.