Politics

ఎంపీ రఘురామపై ₹237కోట్ల ఫోర్జరీ కేసు

Forgery Case Filed Against MP Raghurama Raju

వ్యాపారం కోసం రుణం తీసుకుని రూ.237.84 కోట్లు దారి మళ్లించి, అక్రమంగా లబ్ధి పొందారనే ఫిర్యాదుపై నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఇండ్‌ భారత్‌ పవర్‌ జెన్‌కమ్‌ లిమిటెడ్‌ సంస్థతో పాటు దాని డైరెక్టర్లపై సీబీఐ దిల్లీ విభాగం కేసు నమోదు చేసింది. చెన్నైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎస్‌ఏఎంబీ బ్రాంచ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.రవిచంద్రన్‌ ఈ నెల 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేసింది. ఐపీసీలోని 120బీ రెడ్‌విత్‌ 420, 468, 471తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ 13(1)(డీ) కింద అభియోగాలు మోపింది. నిందితులంతా కుమ్మక్కై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, ఫోర్జరీ పత్రాలను అసలైనవిగా చూపించటం తదితర నేరాలకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. నకిలీ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లు, ఊహాజనిత లావాదేవీలను సృష్టించడం ద్వారా బ్యాంకుల కన్షార్షియం నుంచి తీసుకున్న రుణాల్ని కుట్రపూరితంగానే దారి మళ్లించారని అందులో ప్రస్తావించింది. 2012 నుంచి 2017 మధ్యకాలంలో ఈ మోసం జరిగినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో తాము గుర్తించామని రవిచంద్రన్‌ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీబీఐ వివరించింది.