Business

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు మాంచి ఊపు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు మాంచి ఊపు

దేశంలోని 7 ప్రధాన నగరాలలో ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ ఏడాది జనవరి-మార్చిలో 29 శాతం పెరగొచ్చని స్థిరాస్తి కన్సల్టెంట్‌ అనరాక్‌ నివేదిక పేర్కొంది. గృహరుణ రేట్లు తక్కువగా ఉండటం, మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్‌డ్యూటీలో కోత విధించడం, నిర్మాణదారులు ఇస్తున్న రాయితీలు ఇందుకు ఉపకరించాయని తెలిపింది. 2020 తొలి త్రైమాసికంలో 7 ప్రధాన నగరాలలో 45,200 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఇదే సమయంలో అమ్మకాలు 58,290కి చేరొచ్చని అంచనా వేసింది. మొత్తం అమ్మకాల్లో ముంబయి, పుణె వాటాయే 53 శాతం ఉంటుందని అనరాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి పేర్కొన్నారు.
**సంస్థ వెల్లడించిన వివరాలివీ..
* విక్రయాల్లో వృద్ధి హైదరాబాద్‌లో అధికంగా ఉంది. 2020 జనవరి-మార్చిలో 2680 యూనిట్లు అమ్ముడుపోగా, ప్రస్తుత త్రైమాసికంలో ఈ సంఖ్య 64 శాతం వృద్ధితో 4,400కు చేరనుంది.
* దేశంలోనే ఖరీదైన స్థిరాస్తి విపణిగా పేర్కొనే ముంబయిలో స్టాంప్‌డ్యూటీని పరిమితకాలం పాటు తగ్గించడం కలిసొచ్చింది. ఏడాది క్రితం ఇక్కడ 13910 యూనిట్లు అమ్ముడుపోగా, ప్రస్తుత త్రైమాసికంలో 46 శాతం అధికమై 20,350కి చేరనున్నాయి.
* పుణెలో 7200 నుంచి 47 శాతం వృద్ధితో 10550కి, చెన్నైలో 2190 నుంచి 30 శాతం వృద్ధితో 2850కి, కోల్‌కతాలో 2440 నుంచి 10 శాతం వృద్ధితో 2680కు, దిల్లీలో 8150 నుంచి 8 శాతం వృద్ధితో 8790 యూనిట్లకు చేరనున్నాయి.
* బెంగళూరులో మాత్రం 8630 నుంచి అతిస్వల్పంగా పెరిగి 8670 యూనిట్లకు చేరొచ్చని నివేదిక తెలిపింది.
**అమ్ముడవ్వాల్సినవి 6.42 లక్షలు
ఈ 7 నగరాలలో ఇంకా అమ్ముడవ్వాల్సిన యూనిట్లు 6.42 లక్షలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఈ సంఖ్య 6.44 లక్షలు కాగా, ఈసారి స్వల్పంగా తగ్గింది. ఇదే సమయంలో 6 నగరాలలో ధరలు సగటున 1-2 శాతం పెరిగాయి. కోల్‌కతాలో మాత్రం స్థిరంగా ఉన్నాయని నివేదిక వివరించింది.