Sports

HCA సమావేశంలో అజహర్‌కు సెగ

HCA సమావేశంలో అజహర్‌కు సెగ

ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి 186 మంది క్లబ్ సెక్రేటరీలు, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు హాజరయ్యారు. హెచ్.సీ.ఏ.లో జరుగుతున్న అవినీతి, ప్లేయర్ల సెలక్షన్స్ పై వస్తున్న ఆరోపణలు, జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చింది. కాగా అంబుడ్స్‌మెన్‌గా దీపక్‌వర్మను నియమించాలని అజర్‌ వర్గం పట్టుబడుతుంటే.. వ్యతిరేక వర్గం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ విషయంపై అధ్యక్షుడు అజర్‌ను సభ్యులు ప్రశ్నించారు. దీంతో సమావేశం కాస్త రసాభాసగా మారడంతో వీహెచ్‌ హనుమంతరావు‌ మధ్యలోనే బయటికి వచ్చి మీడియా వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్‌ మాట్లాడుతూ..” హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతితో భ్రష్టు పట్టిపోయింది. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదు. తెలంగాణలోని ఒక్క జిల్లాలోనూ గ్రౌండ్, స్టేడియం లేదు.ఆంద్రప్రదేశ్ లో క్రికెట్ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఉన్న నిధులన్నీ అపెక్స్ కౌన్సిల్ మాయం చేసింది. అంబుడ్స్ మెన్ ఎన్నికల్లోనూ పారదర్శకత లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ వర్మ ని అంబుడ్స్ మెన్ గా ఎలా నిర్ణయిస్తారు? దీనిపై అజార్ ని ప్రశ్నిస్తే ఎలాంటి స్పందన లేదు. ప్రెసిడెంట్ అజర్ కి అధికార పార్టీ అండదండలు వున్నాయి.” అని మండిపడ్డారు. కాగా తదుపరి హెచ్సీఏ సమావేశం వచ్చే నెల 11న జరిగే అవకాశం ఉంది.