Politics

భాజపా రెబల్ అభ్యర్థి నివేదితరెడ్డి నామినేషన్ తిరస్కరణ

Nagarjuna Sagar BJP Rebel Candidate Nivedita Reddy Nomination Rejected

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో మొత్తం 77 మంది అభ్యర్థుల నామినేషన్లకు స్క్రూటినీ పూర్తి అయింది. 17 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. నివేదిత రెడ్డితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, మరో 15 మంది స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యారు. మిగిలిన 60 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు ఆమోదించారు. నిడమనూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియ జరిగింది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్స్ ఉపసంహరణకు గడువు విధించారు. ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగనుండగా…మే 2న కౌంటింగ్ జరుగనుంది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి, బీజేపీ నుంచి రవినాయక్ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్టీల అధ్యక్షులు, సీనియర్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున‌సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు 346 పోలింగ్ కేంద్రాలు కేటాయించినట్లు ఆర్వో రోహిత్ సింగ్ చెప్పారు. కరోనా నేపథ్యంలో 1000 మందికి ఒక పోలింగ్ కేంద్రం, గతంలో కంటే 53 పోలింగ్ కేంద్రాలు పెంచినట్లు వివరించారు. ఏప్రిల్ 17న ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్, సువిధ, విజిల్ యాప్ ద్వారా స్వీకరించి పరిష్కరిస్తామని ఆర్వో రోహిత్ సింగ్ పేర్కొన్నారు.