Sports

టొక్యో ఒలంపిక్స్‌కు భారత “తూటా”లు

టొక్యో ఒలంపిక్స్‌కు భారత “తూటా”లు

టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే 15 మంది షూటర్ల జాబితాను భారత రైఫిల్‌ సంఘం విడుదల చేసింది. స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, 25 మీ ఎయిర్‌ పిస్టల్‌, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌) మూడు విభాగాల్లో బరిలో దిగుతోంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో ఆమె సౌరభ్‌ చౌదరితో కలిసి పోటీపడనుంది. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్‌ షూటర్‌ ఇలవేనిల్‌ వలరివాన్‌ జట్టులో చోటు సంపాదించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో ఆమె పోటీపడనుంది. ఈ కేటగిరిలో అంజుం మౌద్గిల్‌ ఇప్పటికే బెర్తు సాధించినా.. ఆమెను 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌కు మార్చి… ఇలవేనిల్‌కు అవకాశం ఇచ్చారు. 10 మీ ఎయిర్‌రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌తో కలిసి ఇలవేనిల్‌ పోటీపడనుంది. గత నెలలో దిల్లీలో జరిగిన ప్రపంచకప్‌లో 25 మీటర్ల పిస్టల్‌లో స్వర్ణం గెలవడం ద్వారా టోక్యో బెర్తు సాధించిన చింకీని రిజర్వ్‌ షూటర్‌గా జట్టులో చేర్చారు. 10 మీటర్లలో యశస్విని జైస్వాల్‌, 25 మీటర్లలో వెటరన్‌ షూటర్‌ రహీ సర్నోబాత్‌ పోటీలో ఉన్నారు. అంగద్‌వీర్‌ బజ్వా, మైరాజ్‌ అహ్మద్‌ఖాన్‌ (స్కీట్‌), అభిషేక్‌ వర్మ-యశస్విని దేశ్‌వాల్‌ (10 మీ ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌), సంజీవ్‌ రాజ్‌పుత్‌, ఐశ్వర్య ప్రతాప్‌సింగ్‌ (50 మీ రైఫిల్‌ 3 పొజిషన్‌), దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌, దీపక్‌ కుమార్‌ (10 మీ ఎయిర్‌ రైఫిల్‌), సౌరభ్‌ చౌదరి, అభిషేక్‌ వర్మ (10 మీ ఎయిర్‌ పిస్టల్‌) టోక్యోకు ఎంపికైన జట్టులో ఉన్నారు. 2018 నుంచి ఇప్పటిదాకా ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లో కోటా స్థానాలు సాధించిన వారి నుంచి భారత రైఫిల్‌ సంఘం ఈ తుది జట్టును ఎంపిక చేసింది.