తన ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా, అభివృద్ధి కార్యక్రమాలపైన గానీ, తాను అందజేసిన విరాళాలకు సంబంధించిన వివరాలపైన గానీ ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని తానా 2021 అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న నిరంజన్ శృంగవరపు ప్రత్యర్థి వర్గానికి సవాల్ విసిరారు. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాలులో జరిగిన ఆయన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ….2015 డెట్రాయిట్ కన్వెన్షన్కు తాను కోశాధికారిగా వ్యవహరించానని, ఆ మహాసభలకు సంబంధించిన ప్రతి పైసా లెక్కను ఆరు నెలల్లో బోర్డుకు సమర్పించి వారి ఆమోదముద్ర వేయించుకున్నామని, రెండేళ్ల కిందట డీసీలో జరిగిన మహాసభలకు సంబంధించిన లెక్కలకు ఇప్పటికీ దిక్కులేదని నిరంజన్ మండిపడ్డారు. 18నెలలుగా ఇదుగో అదుగో అంటూ ముసుగులో గుద్దులాట తప్ప నివేదికలను సమర్పించలేదని, వేమూరి సతీష్ ఈ మేరకు ప్రశ్నలు అడిగితే దానికి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం హాస్యాస్పదమని నిరంజన్ ధ్వజమెత్తారు. తానా శాశ్వత భవన నిర్మాణ కమిటీకి ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా వ్యవహరించిన 18ఏళ్ల సేవకుడు ఇప్పటివరకు ఒక్క సమావేశాన్ని అయినా నిర్వహించారా? అని నిరంజన్ ప్రశ్నించారు. డీసీ మహాసభలకు నిధుల సేకరణ సమయంలో తానా భవనానికి ఆయా నిధులను ఖర్చు పెడతామని హామీనిచ్చారని వాటికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారని ఆయన అడిగారు. అలసత్వానికి, ఆశ్రితపక్షపాతానికి విరుద్ధంగా పోటీ పడటం తద్వారా మరొకరికి అవకాశం కల్పించడమే తాము కోరుకునే మార్పు అని నిరంజన్ స్పష్టం చేశారు. మహిళలు, వైద్యులు, తదుపరి తరానికి చెందిన యువత కలబోసిన తమ ప్యానెల్ ముఖచిత్రమే మార్పుకి ప్రతిబింబం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తదుపరి అధ్యక్షుడు అంజయ్య చౌదరి, నిరంజన్ ప్యానెల్ సభ్యులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
https://www.youtube.com/watch?v=Wrs0M-ntJiI
శనివారం నాడు నిరంజన్ ప్యానెల్ బొస్టన్లో పర్యటించి అక్కడి ప్రవాసుల మద్దతును కూడగట్టింది.
#####################