గత 18ఏళ్లలో పలు కార్యక్రమాలకు తాను లక్షా25వేల డాలర్ల విరాళాన్ని అందజేశానని, విలువైన సమయాన్ని ధారపోశానని, గతించిన దాని గురించి చర్చించే బదులు రాబోయే కాలంలో సంస్థ పటిష్ఠవంతానికి అమలు చేయబోయే భవిష్యత్ ప్రణాళికలపైనే తన దృష్టి ఉందని తానా 2021 అధ్యక్ష ఎన్నికల బరిలో అభ్యర్థిగా ఉన్న డా.కొడాలి నరేన్ అన్నారు. ఆదివారం సాయంత్రం షార్లెట్ ప్రవాసులతో సమావేశమై ఆయన తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఓర్పుతోనే మార్పు సాధ్యమని పేర్కొన్నారు. దాతలను తానాకు విరాళాలు ఇచ్చేందుకు పురికొల్పేది అసంఖ్యాకమైన తానా కార్యకర్తల బలమేనని ఆయన స్పష్టం చేశారు. సంస్థలో మార్పులు ఉండబోవని కేవలం దాన్ని నడిపించే నాయకత్వంలో భావోద్వేగాల మార్పు ఉంటుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం తద్వార నాయకత్వ లక్షణాల బేరీజుకు అవకాశం కలగడం తానాకు చాలా ఆరోగ్యకరం అని తాను విశ్వసిస్తానని నరేన్ పేర్కొన్నారు. ఈ పరిణామ క్రమంలో ఒడిదుడుకులు సహజమే అయినప్పటికీ ఓటర్లు విజ్ఞత పాటించాలని ఆయన కోరారు. నాయకుడి ఆలోచనలు పంచుకునే కార్యవర్గం తమ ప్యానెల్ బలమని ఆయన ఉద్ఘాటించారు.
############