Politics

పాదయాత్ర చేస్తా. ముఖ్యమంత్రిని అవుతా. బంగారు తెలంగాణా సాధిస్తా.

పాదయాత్ర చేస్తా. ముఖ్యమంత్రిని అవుతా. బంగారు తెలంగాణా సాధిస్తా.

తెలంగాణ రాష్ర్టానికి ఏదో ఒక రోజు తప్పకుండా ముఖ్యమంత్రిని అవుతానని వైఎస్ షర్మిల అన్నారు. నిరుద్యోగుల సమస్యపై దీక్ష చేస్తే అరెస్టులు చేయడమేంటని ఆమె మండిపడ్డారు. తన కార్యకర్తలను వదిలిపెట్టే వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోనని చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్కు వద్ద షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో ధర్నా చౌక్‌ నుంచి లోటస్‌ పాండ్‌కు పాదయాత్రగా బయల్దేరిన ఆమెను పోలీసులు తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వద్ద అడ్డుకుని నిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీస్‌ వాహనంలో లోటస్‌పాండ్‌లోని షర్మిల నివాసానికి తీసుకెళ్లారు. లోటస్‌పాండ్‌లో తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన వేదికపైనే షర్మిల మళ్లీ దీక్ష కొనసాగించారు. రెండు రోజుల పాటు తన ఇంటి ముందు నుంచే దీక్ష చేస్తానని.. పోలీసులు అడ్డుకుంటే ఇంట్లో కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తనకేమైనా జరిగితే వైఎస్‌ అభిమానులు ఊరుకోరని ఆమె హెచ్చరించారు. ఇంకోసారి తనపై చేయి పడితే ఊరుకునేది లేదని షర్మిల హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆమె నినాదాలు చేశారు. బంగారు తెలంగాణ తనతో సాధ్యమని.. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మరోవైపు దీక్షకు దిగిన షర్మిలను మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డా.సునీత పరామర్శించారు.