Sports

భారత అథ్లెట్ల అవకాశాలను నాశనం చేసిన కరోనా

ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే ఛాంపియన్‌షిప్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని తపనపడ్డ హిమదాస్‌, ద్యుతి చంద్‌ లాంటి స్టార్‌ అథ్లెట్లతో కూడిన భారత మహిళల 4×100మీ. రిలే జట్టు ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. శనివారం పోలెండ్‌లోని సిలేసియాలో ఆరంభమయ్యే ఈ ఒలింపిక్స్‌ అర్హత ఛాంపియన్‌షిప్స్‌ కోసం నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌ మీదుగా ఈ భారత మహిళల రిలే జట్టుతో పాటు పురుషుల 4×400మీ. అథ్లెట్ల బృందం ప్రయాణించాల్సి ఉంది. గురువారం తెల్లవారుజామున విమానంలో వాళ్లు ఆమ్‌స్టర్‌డామ్‌కు బయల్దేరాలి. కానీ వైరస్‌ ఉద్ధృతి కారణంగా భారత్‌ నుంచి వచ్చే విమానాలను అనుమతించట్లేదని సోమవారం సాయంత్రమే ఆ దేశం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి పోలెండ్‌కు నేరుగా విమానం లేకపోవడంతో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నించిన భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) చివరకు పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఛాంపియన్‌షిప్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచే రిలే జట్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. మహిళల 4×100మీ. జట్టులో హిమ, ద్యుతి, ధనలక్ష్మీ, అర్చన, ధనేశ్వరి, హిమశ్రీ ఉన్నారు. ఇప్పటికే ఫిట్‌నెస్‌ లేని కారణంగా మహిళల 4×400మీ. రిలే జట్టు ఈ ఛాంపియన్‌షిప్స్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.